నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు ఠాకూర్ రాజారాం సింగ్. మట్టిపొరల్లో దాగి ఉన్న వేల ఏండ్ల మన చరిత్రను తవ్వితీసిన పురాతత్త పరిశోధకుడు ఆయన. పౌరహక్కుల కోసం పనిచేసిన న్యాయవాది. సామాజిక అసమానతలపై కలం ఎక్కుపెట్టిన జర్నలిస్టు. నవ సమాజం కోసం తండ్లాడిన కవి.
ఠాకూర్ రాజారాం సింగ్ 1928 సెప్టెంబర్ 15న పెద్దపల్లి పట్టణంలో నారాయణసింగ్ ఠాకూర్-కృష్ణబాయి దంపతులకు జన్మించారు. అలీగఢ్ యూనివర్సిటీలో మెట్రిక్యులేషన్ చదివిన ఠాకూర్ గ్వాలియర్ యూనివర్సిటీలో ఇంటర్ పూర్తిచేశారు. ఓయూలో బీఏతో పాటు న్యాయవాద కోర్సుల్లో పట్టా పొందారు. ఠాకూర్ రాజారాం సింగ్కు చరిత్ర అంటే ప్రాణం. అందుకే ఆయన వృత్తిరీత్యా న్యాయవాది అయినా ఇంట్లో చరిత్ర, పురావస్తు సంబంధ పుస్తకాలే ఎక్కువగా ఉండేవి.
1967లో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి దగ్గర్లోని పెద్దబొంకూర్లో పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టిం ది. ఈ తవ్వకాల్లో రెండు వేల ఏండ్ల నాటి మన చరిత్ర బయటపడింది. దాంతో పురావస్తు శాస్త్రంపై మరింత ఆసక్తి పెంచుకొని ఆర్కియాలజీలో ఎంఏ చదివారు. ఠాకూర్ కృషి వల్లనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఏకైక ధూళికట్ట బౌద్ధ స్తూపం సమాజానికి తెలిసింది. ఇక్కడ 1975లో పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టింది. ఈ తవ్వకాల్లోనే బౌద్ధ స్తూపం బయటపడింది. ఆ స్తూపం రెండు వేల ఏండ్ల కిందటిదని తెలిసింది.
ఠాకూర్ రాజారాం సింగ్కు తెలుగు, ఇంగ్లీష్తో పాటు హిందీ, ఉర్దూ భాషలపై మంచి పట్టున్నది. ‘అమర భారతి’ అనే కలం పేరుతో ఉర్దూలో అనేక కవితలు రాశారు. శ్రీశ్రీ రాసిన ‘మహాప్రస్థానం’ పుస్తకాన్ని ఉర్దూలోకి అనువదించారు. ఇది ఢిల్లీ నుంచి వెలువడే ఉర్దూ పత్రిక ‘ఫన్ కార్’లో అచ్చయింది. వేమన పద్యాలనూ ఉర్దూ భాషలోకి అనువదించారు. ఇవి ‘పయాం’ అనే ఉర్దూ పత్రికలో అచ్చయ్యాయి. మన పురావస్తు వారసత్వాన్ని మనకందించిన ఠాకూర్ రాజారాం సింగ్ 2003 మార్చి 27న తుదిశ్వాస విడిచారు.