బెంగళూరు: కర్ణాటక నూతన సీఎంగా ఎంపికైన బస్వరాజ్ ఎస్ బొమ్మై.. సరిగ్గా 31 ఏండ్ల క్రితం కొద్ది కాలం సీఎంగా పని చేసిన ఎస్ఆర్ బొమ్మై తనయుడు. 1989 ఆగస్టు 13న రాష్ట్ర సీఎంగా ఎస్ఆర్ బొమ్మై ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆయన ఎంతో కాలం ఆ పదవిలో కొనసాగలేకపోయారు.
1989 ఏప్రిల్ 21న అప్పటి కేంద్ర ప్రభుత్వం 356వ అధికరణాన్ని ఉపయోగించి బొమ్మై సర్కార్ను కూలదోసి, రాష్ట్రపతి పాలన విధించింది. మెజారిటీ జనతా పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ, బొమ్మై ప్రభుత్వానికి మెజారిటీ లేదంటూ, ఆయన ప్రభుత్వాన్ని అప్పటి రాష్ట్ర గవర్నర్ పెండేకంటి వెంకట సుబ్బయ్య రద్దు చేశారు.
అయితే, అసెంబ్లీ వేదికగా మెజారిటీ నిరూపించుకునేందుకు సమయం ఇవ్వాలన్న బొమ్మై అభ్యర్థనను పట్టించుకోలేదు. దీంతో గవర్నర్ ఆదేశాలను ఎస్ఆర్ బొమ్మై.. సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసుగా పేర్కొందిన ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు విస్త్రుతంగానే విచారణ జరిపింది. 356 అధికరణంలోని నిబంధనలు, అధికారాలు తదితరాలపై వివరంగా సమీక్షించింది.
356 అధికరణం సాయంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు కేంద్రానికి గల అధికారాలను తోసిపుచ్చింది. 356 అధికరణం కింద కేంద్రం అధికారాలపై ఆంక్షలు విధించింది. దీంతో ఈ కేసు కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై భారీగా ప్రభావం చూపింది. తర్వాత వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం తగ్గుముఖం పట్టింది.