న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. బార్లు, హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్లను తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. నగర ఆదాయాన్ని పెంచేందుకు, లిక్కర్ మాఫియా ఆగడాలను నిలువరించేందుకు ఢిల్లీ సర్కార్ కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించినట్లు తెలుస్తోంది. సోమవారం రోజున ఈ విధానాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా విదేశీ విజిటర్స్ వస్తున్న నగరాల్లో ఢిల్లీ 28వ స్థానంలో ఉన్నది. అబార్కీ ఆదాయం చాలా కీలకమైన వనరు అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. అయితే కొత్త విధానంలో హోమ్ డెలివరీ గురించి ఎటువంటి వివరణ ఇవ్వలేదు. మద్యం సేవించేందుకు చట్టపరమైన వయసును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు కుదించారు. మద్యం విక్రయాల్లో రిటేల్ రంగం నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే మద్యం షాపులను మూసివేసి.. ప్రైవేటు షాపులను ప్రోత్సహించనున్నారు.