కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బ్యాంకులు సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయి. ఈ నెల రెండో తేదీ గురువారం నుంచి ఇది అమలులోకి వస్తుందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈ మేరకు బ్యాంకు పని గంటలను గతంలో మాదిరిగా పొడిగించినట్లు చెప్పారు. కరోనా నేపథ్యంలో బెంగాల్లో బ్యాంకులు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పని చేస్తున్నాయి. శనివారం, ఆదివారాల్లో బ్యాంకులను మూసివేస్తున్నారు. మే నెల నుంచి దీనిని అమలు చేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతోపాటు ‘లక్ష్మీర్ భండార్’ అనే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో కొత్త బ్యాంకు ఖాతాలు తెరువాల్సి ఉండటంతో బ్యాంకుల పని వేళలను గతంలో మాదిరిగా సాధారణ స్థాయికి మార్పు చేసినట్లు సీఎం మమత తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంట వరకు బ్యాంకులు తెరిచి ఉంటాయని, సాయంత్రం 4 గంటల వరకు బ్యాంకు కార్యకలాపాలు జరుగుతాయని చెప్పారు.
కాగా, ‘లక్ష్మీర్ భండార్’ పథకం ద్వారా 25-60 ఏండ్ల మహిళలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. దీని కింద షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కుటుంబాల మహిళా ఇంటి పెద్దకు నెలకు రూ.1,000, సాధారణ వర్గానికి చెందిన వారికి రూ.500 ఆ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ నగదును వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తుంది. ఈ పథకం కింద సుమారు 1.6 కోట్ల మంది ప్రజలు లబ్ధిపొందనున్నారు.