కోల్కతా: రాబోయే ఐపీఎల్ 14వ సీజన్ కోసం టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లందరూ విడతల వారీగా ఆయా జట్లతో కలుస్తున్నారు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ షురూ చేయగా కోల్కతా నైట్ రైడర్స్ కూడా ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభించేందుకు సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో ఆటగాళ్లు, సిబ్బంది కోసం ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ను ఏర్పాటు చేసింది.
కోల్కతా త్వరలో శిక్షణా శిబిరం మొదలెట్టేందుకు సిద్ధంగా ఉండగా తమ జట్టు అభిమానుల కోసం క్వారంటైన్ సాంగ్ను విడుదల చేసింది. వరుసగా రెండో సీజన్లోనూ ఐపీఎల్ మ్యాచ్లను వీక్షించడాన్ని అభిమానులు కోల్పోతున్నందున ఫ్యాన్స్కు అంకితం చేస్తూ ఈ పాటను రూపొందించారు. వీ విల్ మిస్ యూ అంటూ కేకేఆర్ ట్విటర్లో సాంగ్ను రిలీజ్ చేసింది.
వికెట్ కీపర్ బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫాస్ట్ బౌలర్ కమలేష్ నాగర్కోటి, బ్యాట్స్మన్ రాహుల్ త్రిపాఠి తదితరులు ఆదివారం నుంచి ప్రారంభమైన క్వారంటైన్లో చేరారు.