న్యూఢిల్లీ, మే 28: లాక్డౌన్ వల్ల బ్యాంకుల్లో నగదు విత్ డ్రా చేసుకోవడానికి వెళ్లడం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇంటి దగ్గరే ఉండి తమ ఖాతాలో నగదు పొందేలా పోస్టల్ విభాగం వెసులు బాటు కల్పించింది. ఆధార్ ద్వారా లావాదేవీలు జరిపేవారికి (ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సర్వీస్- ఏఈపీఎస్) పోస్టల్ ఉద్యోగులు ఇంటికి వచ్చి నగదు అందిస్తున్నారు. అయితే, దీని కోసం బ్యాంకులో ఖాతా ఉండి, దానికి ఆధార్ కార్డు అనుసంధానం అయి ఉండాలి. బ్యాంకు కచ్చితంగా ఏఈపీఎస్లో భాగస్వామి అయి ఉండాలి. ఆధార్ ద్వారా జరిగే నగదు లావాదేవీలు బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా పూర్తవుతాయి.
ఆధార్ ఎనేబుల్ పేమెంట్ అంటే?
ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ అనేది ఒకరకమైన చెల్లింపు సేవ. ఇది బ్యాంక్ వినియోగదారులు ఆధార్ను ఉపయోగించి లావాదేవీలు నిర్వహించడానికి అనుమతినిస్తుంది. ఏఈపీఎస్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)లో భాగస్వాములుగా ఉన్న బ్యాంకుల్లోని ఖాతాదారులకు ఇది అందుబాటులో ఉంటుంది.
ఏయే సేవలు లభిస్తాయి?
ఏఈపీఎస్ ద్వారా బ్యాలన్స్ ఎంక్వైరీ, ఆధార్ కార్డు నుంచి ఆధార్కార్డుకు నగదు లావాదేవీలు, నగదు విత్డ్రా, మినీ స్టేట్మెంట్ సేవలు పొందవచ్చు.