మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దీంతో విక్టోరియా రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అక్కడ లాక్డౌన్ను అమలు చేయడం ఇది నాలుగవ సారి. ఆస్ట్రేలియాలో అత్యధిక జనాభా ఉన్నది ఈ రాష్ట్రంలోనే. వేగంగా వ్యాపిస్తున్న వైరస్ను కట్టడి చేసేందుకు మెల్బోర్న్తో పాటు అన్ని ప్రదేశాల్లోనూ ఏడు రోజుల పాటు కఠిన లాక్డౌన్ పాటించనున్నారు. కొత్తగా మెల్బోర్న్లో 26 కేసులు నమోదు అయ్యాయి. వైరస్ వ్యాప్తి చెందే 150 ప్రదేశాలను గుర్తించారు.
గత ఏడాది వచ్చిన సెకండ్ వేవ్ తరహాలో మళ్లీ ఏదైనా విపత్తు సంభవించే అవకాశాలు ఉన్నట్లు ఆస్ట్రేలియన్లు భయపడుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన B.1.617 వేరియంట్ను గుర్తించినట్లు విక్టోరియా మంత్రి జేమ్స్ మెర్లినో తెలిపారు. ఊహించిన దానికన్నా ఎక్కువ వేగంతో ఆ స్ట్రెయిన్ వ్యాపిస్తున్నట్లు మెర్లినో తెలిపారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ కేసులు పది వేల వరకు ఉంటాయని ఆయన అన్నారు. ఆలస్యం చేస్తే భారీ నష్టం జరిగే అవకాశం ఉందని, అందుకే లాక్డౌన్ పాటిస్తున్నట్లు తెలిపారు.
విక్టోరియాలో ఏడు రోజుల పాటు కఠిన లాక్డౌన్ పాటించనున్నారు. అందరూ ఇండ్లకే పరిమితం కావాలని ఆదేశించారు. అత్యవసర సేవలు మాత్రం నడవనున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మాస్క్లు తప్పనిసరి. ఇంటి నుంచి 3 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం వెళ్లవద్దు. విక్టోరియాకు వచ్చే ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా నిషేధ ఆజ్ఞలు జారీ చేశారు.