ఆర్టీపీఆర్సీ సెంటర్ త్వరలో ఏర్పాటు
జిల్లా కేంద్రంలో ఆక్సిజన్తో కూడిన బెడ్లు
అనంతగిరి, మహావీర్, సాయిడెంటల్లో కొవిడ్ బెడ్లు
సీఎం కేసీఆర్ కోలువాలని కోరుకుందాం
విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి
వికారాబాద్, ఏప్రిల్ 27 : కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని, సర్కారు దవాఖానల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అనంతపద్మనాభ స్వామి కళాశాల పక్కన వంద పడకల దవాఖానను ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసుతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, కేటీఆర్, సంతోశ్కుమార్లు కరోనా బారిన పడినా ప్రజాసేవకు నిత్యం కృషి చేస్తున్నారన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రానికి ఆర్టీపీఆర్సీ సెంటర్ మంజూరైందని, ఎక్కడ ఏర్పాటు చేయాలన్నదానిపై ఎమ్మెల్యే ఆనంద్, కలెక్టర్ నిర్ణయిస్తారన్నారు.
మే 1 నుంచి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ చేస్తారన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో కొవిడ్ బెడ్లు ఏర్పాటు చేశారన్నారు. అనంతగిరి టీబీ దవాఖానలో ఓ వార్డు, శ్రీ సాయి డెంటల్ దవాఖాన, మహావీర్ దవాఖానలో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారన్నారు. వికారాబాద్ దవాఖానలో ఆక్సిజన్తో కూడిన బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, ఆర్డీవో ఉపేందర్రెడ్డి, జడ్పీ వైస్చైర్మన్ విజయ్కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదాకర్షిండే, కొవిడ్ ఇన్చార్జి డాక్టర్ అరవింద్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, డాక్టర్లు రమ్యశ్రీ, మున్సిపల్ కమిషనర్ బుచ్చయ్య, డీఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధాకర్షిండేను కొవిడ్ వివరాలు అడుగగా, లేకపోవడంతో మండిపడ్డారు.
తాండూరు, ఏప్రిల్ 27: ‘సర్కారు దవాఖానల్లో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి… కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది..’ అని విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు జిల్లా దవాఖానను పరిశీలించారు. సిటీస్కానింగ్ పని చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ నూతన భవనంలో మున్సిపల్, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, పోలీస్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ సర్పంచ్లు, కార్యదర్శులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రైవేటు దవాఖానల్లో ఎక్కువ బిల్లులు వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు.
వికారాబాద్ మహవీర్ దవాఖానలో 150 బెడ్లు, సాయి డెంటల్ 50 బెడ్లు, తాండూరు దవాఖానలో 50 బెడ్లతో పాటు మరో 50 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. జర్నలిస్టులను ఆదుకోవాలని మంత్రికి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ కరోనా నియంత్రణలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలు రెండు వారాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీగౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న, వైస్ చైర్ పర్సన్ దీప, కలెక్టర్ పౌసుమి బసు, అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, చంద్రయ్య, ఆర్డీవో అశోక్కుమార్, డీఎస్పీ లక్ష్మీనారాయణ, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ మల్లికార్జున్ పాల్గొన్నారు.