హరిద్వార్: కరోనా సంక్షోభ వేళ కుంభమేళాను ప్రతీకాత్మకంగానే నిర్వహించాలంటూ ఇవాళ సాధువులను ప్రధాని మోదీ కోరిన విషయం తెలిసిందే. హరిద్వార్లోని జునా అఖారాకు చెందిన స్వామి అవదేశానంద్ గిరితో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో అవదేశానంద్ గిరి మీడియాతో మాట్లాడుతూ.. చాలా వరకు పుణ్య స్నానాలు ముగిశాయని, కేవలం బైరాగీల స్నానాలు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ ఇవాళ తనతో ఫోన్లో మాట్లాడరని, కుంభమేళా గురించి ఆరా తీశారని, సాధువుల ఆరోగ్యం గురించి కూడా క్షేమ సమాచారం తెలుసుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే కుంభమేళాలో భాగంగా జరిగే స్నానాల్లో దాదాపు చాలా వరకు షాహీ స్నానాలు ముగిశాయని, కేవలం బైరాగీలది మాత్రమే ఉందన్నారు. అయితే ఆ స్నానాల్లో పాల్గొనే సాధువుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని, వాళ్లు కూడా చాలా తక్కువ సంఖ్యలోనే పాల్గొనేందుకు నిర్ణయించినట్లు స్వామి అవదేశానంద్ గిరి తెలిపారు. పవిత్ర స్నానాలు ఆచరించే రోజుల్లో .. ఇంకా ఏప్రిల్ 21(శ్రీరామనవమి), ఏప్రిల్ 27(చైత్ర పూర్ణిమ)న జరిగే స్నానాలు మాత్రమే ఉన్నాయి.