చండీగఢ్: బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రాంచందర్ జంగ్రా ( Ram Chander Jangra ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హర్యానాకు చెందిన ఆయన స్థానికంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలోని శిల్పుల ప్రస్తావన తీసుకొచ్చారు. దేశంలోని శిల్పులంతా విశ్వకర్మ వారసులేనని ఆయన పేర్కొన్నారు. మొగల్ చక్రవర్తి బాబర్ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన వెంట శిల్పులను వెంటబెట్టుకునేమీ రాలేదని వ్యాఖ్యానించారు.
ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఎటుచూసినా ఇసుక దిబ్బలే కనిపిస్తాయని, అక్కడ శిల్పకళ అనేదే లేదని రాంచందర్ జంగ్రా చెప్పారు. కాబట్టి ప్రపంచంలోని ముస్లిం శిల్పులంతా విశ్వకర్మ వారసులే అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, జంగ్రా వ్యాఖ్యలపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.