కోల్కతా: బీజేపీని వీడి టీఎంసీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో, తొలిసారి ప్రధాని మోదీ లక్ష్యంగా మాటల దాడి చేశారు. ఢిల్లీ నుంచి హౌరాకు వచ్చిన ఆయన మీడియాతో బుధవారం మాట్లాడారు. బెంగాలీలపై మోదీకి నమ్మకం లేదని, అందుకే బెంగాల్ ప్రజలతో సామరస్యపూర్వక సంబంధాన్ని ఆయన గుర్తించలేకపోయారని బాబుల్ సుప్రియో విమర్శించారు. ‘నేను ఢిల్లీలో ఉన్న ఏడెనిమిది ఏండ్ల కాలంలో ఒక విషయాన్ని గ్రహించాను. ప్రధాని మోదీకి బెంగాలీలపై విశ్వాసం లేదు. అందుకే సామరస్యాన్ని నెలకొల్పలేకపోతున్నారని నాకు తెలిసింది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
బెంగాల్లో గెలిచిన ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరినా వారిని ఆ పార్టీ నమ్మడం లేదని, ఎక్కడో సామరస్య లోటు ఉన్నదని బాబుల్ సుప్రియో ఆరోపించారు. అందుకే తానే గాక, కాంగ్రెస్కు చెందిన బెంగాల్ సీనియర్ నేత సుందర్ జిత్ సింగ్ కూడా బీజేపీని వీడిన సంగతిని గుర్తు చేశారు. సీఎం దీదీ నాయకత్వంలో పనిచేయడానికి, బెంగాల్ ప్రజలకు సేవ చేయడానికి తాను టీఎంసీలో చేరానని వివరించారు.
కాగా, సీఎం మమతా బెనర్జీ పోటీ చేసే భవానీపూర్తో పాటు మరో రెండు స్థానాల్లో గురువారం ఉప ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి ఒక రోజు ముందు బీజేపీని వీడి ఇటీవల టీఎంసీలో చేరిన బాబుల్ సుప్రియో తొలిసారి ప్రధాని మోదీ లక్ష్యంగా మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకున్నది. మరోవైపు ఎంపీ అయిన ఆయన ఢిల్లీలోని అధికార నివాసాన్ని ఖాళీ చేసి కుటుంబంతో సహా బెంగాల్లోని హౌరాకు చేరారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని ఇటీవల ఆయన ప్రకటించారు.