ముంబై: సామాజిక కార్యకర్త, పరిశోధకురాలు, రచయిత డాక్టర్ గెయిల్ ఓంవేద్ ( Gail Omvedt ) కన్నుమూశారు. శ్రామిక్ ముక్తీ దళ్ ఏర్పాటులో ఆమె కీలక పాత్ర పోషించారు. తన భర్త, కార్యకర్త భారత్ పటాంకర్తో కలిసి ఆమె శ్రామిక్ ముక్తీ దళ్ను స్థాపించారు. బహుజన్ ఉద్యమంలో ఆమె తన స్వరాన్ని వినిపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విజన్, ఐడియాలను ఆమె సూక్ష్మస్థాయిలో అధ్యయనం చేశారు. అంబేద్కర్ స్టడీ కోసమే ఓంవేద్ తన జీవితాన్ని సమర్పించారు.
గెయిల్ ఓంవేద్ వయసు 81 ఏళ్లు. సంగ్లీ జిల్లాలోని కేసేగావ్ గ్రామంలోని తన నివాసంలో ఆమె తుది శ్వాస విడిచారు. అంబేద్కర్-పూలే ఉద్యమంపై పీహెచ్డీ చేసేందుకు ఆమె అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు. అయితే గెయిల్ ఇక్కడే స్థిరపడిపోయారు. భారతీయ పౌరురాలిగా మారిన ఆమె.. సామాజిక కార్యకర్త భరత్ పటాంకర్ను పెళ్లి చేసుకున్నారు. కుల వ్యతిరేక ఉద్యమంలో ఆమె విశేష పాత్ర పోషించారు. ఎన్నో రచనలు చేశారామె. మహిళా, పర్యావరణ సమస్యలపైన కూడా కథనాలు రాశారు.
భారత్లోని కులవ్యవస్థ.. అమెరికాలోని వర్ణవివక్ష గురించి ఆమె తనలో ఉన్న కచ్చితమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భర్త భరత్తో కలిసి ఆమె ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. శ్రామిక్ ముక్తీ దళ్ ఏర్పాటులో వ్యవస్థాపక సభ్యురాలిగా ఉన్నారు. గడిచిన ఏడాదిన్నర నుంచి అనారోగ్యంతో గెయిల్ బాధపడుతున్నారు. భారత్లో సాగిన బహుజన, ఫెమినిస్ట్ ఉద్యమాలపై ఆమె ఎన్నో పుస్తకాలు రాశారు.
మహాత్మా పూలే సత్యశోధక్, 1970 దశకంలో సాగిన నాన్బ్రాహ్మిణ్ మూమెంట్పై పీహెచ్డీ చేసేందుకు ఆమె ఇండియా వచ్చారు. దళిత, బహుజన, మానవ హక్కుల కోసం ఆమె పోరాటం చేశారు. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాలను గెయిల్ తిరిగేవారు. కొంకణ్ ప్రాంతంలో నీటి హక్కుల కోసం సాగిన ఉద్యమంలో ఆమె పాలుపంచుకున్నారు.
అమెరికాలోని మిన్నసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్లో 1941, ఆగస్టు 2వ తేదీన గెయిల్ జన్మించారు. 1963-64 సమయంలో ఆమె ఇండియాలో విజిట్ చేశారు. దళిత, కుల వ్యతిరేక ఉద్యమం పట్ల ఆమె ఆకర్షితురాలయ్యారు. మళ్లీ పీహెచ్డీ కోసం ఆమె 1970-71లో ఇండియాకు వచ్చారు. 1976లో భరత్ పటాంకర్ను ఆమె పెళ్లి చేసుకున్నారు. 1983లో భారతీయ పౌరసత్వం సాధించారు.