న్యూఢిల్లీ: ఒక్క యూట్యూబ్ వీడియోతో పాపులర్ అయిపోయిన ఢిల్లీలోని బాబా కా దాబా ఓనర్ కాంతా ప్రసాద్ (81) ఆత్మహత్యాయత్నం చేశాడు. గురువారం రాత్రి ఈ ఘటన జరగగా.. అతన్ని వెంటనే సఫ్దర్జంగ్ హాస్పిటల్కు తరలించారు. తమకు గురువారం రాత్రి 11.15 గంటల సమయంలో సమాచారం తెలిసిందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కాంతా ప్రసాద్ మద్యంతోపాటు నిద్రమాత్రలు మింగినట్లు డాక్టర్లు చెప్పారు. ఆ వెంటనే అతడు స్పృహ కోల్పోయినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
2020లో గౌరవ్ వాసన్ అనే ఓ యూట్యూబర్ కాంతా ప్రసాద్, అతని భార్య నిర్వహిస్తున్న దాబాపై తీసిన వీడియోతో రాత్రికి రాత్రి పాపులర్ అయిపోయారు. వాళ్లు ఎంతో కష్టంగా బతుకీడుస్తున్నారని, ఆదుకోవాలని సదరు యూట్యూబర్ తన ఫాలోవర్లను కోరాడు. ఆ వెంటనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. కాంతా ప్రసాద్కు సపోర్ట్ చేయండంటూ సెలబ్రిటీలు కూడా కోరారు. దీంతో బాబా కా దాబా ఫేమస్ అయింది.
అయితే దేశం నలుమూలల నుంచి తనకు వచ్చిన విరాళాల విషయంలో ఆ యూట్యూబర్ గౌరవ్ వాసన్, కాంతా ప్రసాద్ మధ్య వివాదం చెలరేగింది. తనకు వచ్చిన భారీ విరాళాలతో కాంతా ప్రసాద్ ఓ రెస్టారెంట్ ప్రారంభించాడు. కానీ ఈ ఏడాది మొదట్లో దానిని మూసివేశాడు. వాళ్లు ఈ మధ్యే తిరిగి తమ పాత ప్లేస్కు వెళ్లి బాబా కా దాబా ప్రారంభించారు. ఇంతలోనే కాంతా ప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశాడు.