లక్నో: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామ మందిరానికి సంబంధించి మొదటి దశ పనులు పూర్తయ్యాయి. తొలి దశలో రామాలయం పునాది పనులు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మించిన కాంక్రీట్ బేస్పై రాళ్లతో మరో పొరను ఏర్పాటు చేయనున్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ గురువారం తెలిపారు. ఈ రాతి పొర నిర్మాణంలో కర్ణాటక గ్రానైట్ , మీర్జాపూర్ ఇసుక రాయిని వినియోగిస్తామని చెప్పారు.
కాగా, అయోధ్యలోని పది ఎకరాలకుపైగా స్థలంలో భూకంపాలను సైతం తట్టుకునేలా నిర్మిస్తున్న మూడంతస్తుల భవ్య రామాలయాన్ని 2024 లోక్ సభ ఎన్నికలకు ముందుగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2020 ఆగస్ట్ 5న ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజతో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆలయం పునాది కోసం 40 అడుగుల లోతున తవ్వారు. అనంతరం ఒక్కో పొర అడుగు మేర ఎత్తులో 47 పొరలతో కాంక్రీట్ బేస్ను నిర్మించారు. 360X235 అడుగుల నిర్మాణంలోని గ్రౌండ్ ఫ్లోర్లో 160 స్తంభాలు, మొదటి అంతస్తులో 132 స్తంభాలు, రెండవ అంతస్తులో 74 స్తంభాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఐదు మండపాలు కూడా ఉంటాయి.
మరోవైపు టెంపుల్ కాంప్లెక్స్లో యాత్రికుల సౌకర్య కేంద్రం, మ్యూజియం, ఆర్కైవ్లు, పరిశోధనా కేంద్రం, ఆడిటోరియం, పశువుల షెడ్డు, ఆచారాలకు స్థలం, పరిపాలనా భవనం, పూజారులకు గదులు ఉంటాయి. ‘కుబెర్ తిలా’, ‘సీతా కూప్’ వంటి సమీప వారసత్వ కట్టడాలను సంరక్షించడానికి, అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు కూడా రూపొందించారు. 2023 డిసెంబర్ నాటికి భవ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేయాలని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకున్నది.