అయోధ్య: దేశంలోని కోట్లాది మంది హిందువులు ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఆలయానికి సంబంధించిన పునాది నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 2023 చివరిలోపు భక్తులకు అయోధ్య రాముడి దర్శనభాగ్యం కల్పించాలన్న ఉద్దేశంతో రామ జన్మభూమి ట్రస్ట్ ఆలయ పనుల వేగం పెంచింది. అదే సమయంలో భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ ఆలయానికి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్నదని ఎప్పటి నుంచో ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఓ భారీ ట్రక్ స్కానర్ను విదేశాల నుంచి రప్పిస్తున్నారు. ఆలయ నిర్మాణం కోసం సామగ్రిని మోసుకొచ్చే ట్రక్లను పూర్తిగా స్కాన్ చేయడానికి వీలుగా ఈ స్కానర్ను ఏర్పాటు చేయనున్నారు. సిమెంట్ నుంచి మార్బుల్స్ వరకూ వివిధ నిర్మాణ సామగ్రిని మోసుకొచ్చే ట్రక్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొని పేలుడు పదార్థాలు అమర్చే ప్రమాదం ఉండటంతో ఈ ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చే ఈ ట్రక్ స్కానర్ ఓ భారీ ట్రక్ను కూడా కేవలం రెండే నిమిషాల్లో స్కాన్ చేస్తుంది.
విదేశాల నుంచి వచ్చే ఈ స్కానర్ ఒక్కోదానికి సుమారు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఉంటుందని ఓ అధికారి వెల్లడించారు. ఇప్పటికే దీని కొనుగోలు కోసం వివిధ విదేశీ కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయి. ఈ మధ్యే అటారీలోని ఇండియా, పాకిస్థాన్ సరిహద్దులోనూ ఇలాంటి స్కానర్ను ఏర్పాటు చేశారు. ఈ స్కానర్ ద్వారా స్మగ్లింగ్ లేదా ఇతర పేలుడు పదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేయవచ్చు. అయోధ్య మందిర భద్రతలో పాలుపంచుకుంటున్న యూపీ పోలీసులకు మరో ఆరేడు నెలల్లో ఈ స్కానర్ ఇవ్వనున్నట్లు ట్రస్ట్ అధికారులు తెలిపారు.