సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ) /బేగంపేట్ : ఈ ఏడాది ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. రోడ్ల మరమ్మతులు, శానిటేషన్, ఆలయాల వద్ద లైటింగ్ తదితర సౌకర్యాలపై దృష్టి సారించింది. బోనాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.15కోట్ల్లు మంజూరు చేయనున్నది. ఈ మేరకు ఆషాడమాసం బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై ఈనెల 25వ తేదీన ఉదయం 11.30 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్ హెచ్ఆర్డీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాద వ్ పేర్కొన్నారు. గత సంవత్సరం కరోనా కారణంగా బోనాలను నిర్వహించుకోలేకపోయినందున ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి తెలిపారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సం స్కృతి ఉట్టిపడేలా వివిధ వేషాధారణలతో కళాకారుల ప్రదర్శనలు, త్రీడీ మ్యాపింగ్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కరోనాను పారద్రోలాలని కోరుతూ అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నామని వివరించారు. మంత్రి తలసాని అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోం మంత్రి మహమూద్ అలీ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, పోలీస్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, కలెక్టర్ శ్వేతా మహంతి, పలు శాఖల అధికారులు పాల్గొంటారు.
వచ్చే నెల 13వ తేదీన నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం నిర్వహణ, ఏర్పాట్లపై ఈ నెల 23వ తేదీన మాసాబ్ట్యాంక్లోని పశు సంవర్థక శాఖ మంత్రి కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో వివిధ శాఖలతో సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో దేవాదాయశాఖ, జీహెచ్ఎంసీ, వాటర్బోర్డు, ఎలక్ట్రిసిటీ, హెల్త్ తదితర శాఖల అధికారులు పాల్గొంటారు.