ఢిల్లీ : కొవిడ్ రోగులకు కనీసం ఆక్సిజన్ను అందుబాటులో ఉంచాల్సిందిగా కోరుతూ పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని ట్వీట్ చేస్తూ కోరారు. కరోనా సెకండ్ వేవ్లో వేలాది మంది ఆక్సిజన్ సౌకర్యం అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోతుండటాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. పరిస్థితులను అదుపులో ఉంచేందుకు కనీసం ఆక్సిజన్నైనా అందుబాటులో ఉంచాలన్నారు.
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందుబాటు అంశంలో ఢిల్లీ హైకోర్టు స్పందిస్తూ.. అడుక్కోండి.. అప్పుతెచ్చుకోండి, దొంగిలించండి.. కానీ ఇది మీ బాధ్యత.. పౌరుడు ప్రభుత్వాలపై తిరగబడొచ్చని కేంద్రానికి సూచించిన అంశాన్ని ఆయన ఈ సందర్భంగా జోడించారు. మంగళవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ ఆక్సిజన్ డిమాండ్ విషయాన్ని అంగీకరించారు. వీలైనంత త్వరగా అందుబాటులోకి వచ్చేలా కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేటు సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని తెలిపారు.
ఆక్సిజన్ లేమితో జరిగిన ప్రాణనష్టంపై ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు. కొవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరత అతి పెద్ద ఆందోళనగా మారిందన్నారు. అయితే ఆక్సిజన్ సరఫరాపై రౌండ్-ది-క్లాక్ పర్యవేక్షణకు ప్రభుత్వం హామీ ఇస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ ఊదరగొట్టే ప్రసంగాల కోసం కాకుండా దేశం పరిష్కారాల కోసం ఎదురు చూస్తోందని పేర్కొన్నారు.