పాట్నా : దైవ ప్రసాదం తిని 170 మంది అస్వస్థతకు గురయ్యారు. బిహార్ రాష్ట్రం ముంగేర్ జిల్లా కోత్వన్ గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మహేశ్ కోడా అనే వ్యక్తి సోమవారం సాయంత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేశాడు. ఈ వ్రతానికి దాదాపు 250 మందిని ఇంటికి ఆహ్వానించాడు. పూజాది కార్యక్రమాలు, సత్యనారాయణ స్వామి కథ అనంతరం అతిధులకు స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ప్రసాదం తిన్న గ్రామస్తుల్లో చాలా మంది కడుపునొప్పి, తలతిరగడం, వాంతులు చేసుకున్నారు.
బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లా యంత్రాంగం సివిల్ సర్జన్ను అప్రమత్తం చేసింది. ఇద్దరు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఆరుగురు, మూడు అంబులెన్స్లతో గ్రామానికి చేరుకున్నారు. వైద్య చికిత్స అనంతరం బాధితుల్లో దాదాపుగా అందరూ అనారోగ్యం నుంచి కోలుకున్నట్లు జిల్లా కలెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. చికిత్స చేసిన డాక్టర్ ఎన్కే మెహతా మాట్లాడుతూ.. మొత్తం 170 మంది బాధితుల్లో ఇంకా 80 మందికి చికిత్స కొనసాగుతున్నట్లు చెప్పారు. కాగా ఎవరికి ప్రాణాపాయం లేదన్నారు.
సివిల్ సర్జన్ డాక్టర్ హరేంద్ర కుమార్ అలోక్ మాట్లాడుతూ.. డిహైడ్రేషన్తో బాధపడుతున్న 15 మంది బాధితుల్ని సమీప కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వీరంతా కోలుకున్నారని మంగళవారం సాయంత్రం వరకు అందరినీ డిశ్చార్జీ చేయనున్నట్లు చెప్పారు. ప్రసాదమే అనారోగ్యానికి కారణంగా పేర్కొన్న అధికారులు ప్రసాదం శాంపిల్స్ను పరీక్ష నిమిత్తం లేబోరేటరీకి పంపినట్లు వెల్లడించారు.