పల్లె ప్రగతితో తీరిన కరంటు కష్టాలు
దుబారాకు చెల్లుచీటి
పగటి వెలుగులకు స్వస్తి
అన్ని గ్రామాల్లో మూడో లైన్ ఏర్పాటు
తాండూర్, మార్చి 13 :తెలంగాణ సర్కారు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తున్నది. వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నది. దీంతో విద్యుత్ అవసరం గణనీయంగా పెరిగింది. ఇదే తరహాలో కరంటు దుబారా కూడా పెరిగింది. దీనికితోడు విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరడం, తీగలు వంగి ఉండడం, వీధి దీపాలు సక్రమంగా వెలుగకపోవడం, పగలు కూడా వెలుగడం, కరంటు ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో? తెలియని పరిస్థితి ఉండేది. తెలంగాణ సర్కారు రెండు విడుతలుగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఈ సమస్యలకు పరిష్కారం లభించింది. –
వంద శాతం పరిష్కారం
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో 15 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రతి ఆవాసానికి విద్యుత్ కనెక్షన్ ఉంది. విద్యుత్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి లోఓల్టేజీ సమస్యను తొలగించారు. ట్రాన్స్ఫార్మర్ల చుట్ట్టూ పిచ్చి మొక్కలు ఉండగా.. గాలి వానకు కరంటు ఎప్పుడూ పోతుండడంతో పిచ్చి మొక్కలను తొలగించారు. మండలంలోని పలు గ్రామాల్లో 292 మిడిల్ పోల్స్ వేసి వేలాడుతున్న కరంటు తీగలను సరిచేశారు. ప్రతి వీధిలో విద్యుద్దీపాలు అమర్చి ఆన్ఆఫ్ కంట్రోలింగ్ సిస్టం అమర్చారు. మండలంలో పల్లె ప్రగతి కార్యాచరణ పనుల్లో వంద శాతం కరంటు సమస్యలు పరిష్కరించడంతో వేలాడుతున్న కరంటు తీగల సమస్య కూడా తీరింది.
మూడో తీగ ఏర్పాటు
విద్యుత్ దుబారాను నియంత్రించి, పొదుపు పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. జీపీలపై బిల్లుల భారం తగ్గించేందుకు మూడో తీగ ఏర్పాటుకు ట్రాన్స్కో అధికారులు నిర్ణయించారు. దీనికోసం పంచాయతీలవారీగా సర్వే చేసి 52 కి.మీ. మేర అవసరమని గుర్తించారు. ప్రణాళికాబద్ధంగా ఒక్కో గ్రామాన్ని ఎంచుకొని పనులు చేపట్టి పూర్తి చేశారు. ట్రాన్స్కో ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించి పనులు వేగవంతమయ్యేలా కృషి చేశారు. 24 గంటలపాటు వీధి దీపాలు వెలిగే గ్రామాల్లో విద్యుత్ స్తంభాలకు రెండు తీగలు ఉన్న చోట మూడోది, నాలుగు తీగలు ఉన్న చోట ఐదోది బిగించారు. మండలంలో అవసరమైన గ్రామాల్లో 37 ఆన్ఆఫ్ (ఎంసీబీ) కంట్రోలింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు.
ప్రమాదాలు జరుగుతలేవు..
ముఖ్యమంత్రి కేసీఆర్ సారు చేపట్టిన పల్లె ప్రగతి వల్ల గ్రామాల్లో కరంటు ప్రమాదాలు జరుగుతలేవు. పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేసింన్రు. వంగిన స్తంభాల చోట కొత్తవి వేసింన్రు. త్రీఫేజ్ లైన్ ఉన్న చోట 5వ లైన్ కూడా ఏర్పాటు చేసింన్రు. గిప్పుడు ఎంత గాలి వాన వచ్చినా కరంటు పోతలేదు. ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న కరంటు కట్టాలు గీ పల్లె ప్రగతి వల్ల తొలిగిపోయాయి.
ప్రత్యేక తీగతో నియంత్రణ
గ్రామాల్లో విద్యుత్ దుబారాను అరికట్టేందుకు పల్లె ప్రగతిలో భాగంగా అన్ని గ్రామాల్లో ప్రత్యేక తీగ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మండలంలోని అన్ని గ్రామాల్లో మూడో తీగ ఏర్పాటు చేశాం. ఫలితంగా విద్యుత్ను ఆదా చేసుకోవడం జరుగుతున్నది. పంచాయతీలకు బిల్లుల భారం చాలా వరకు తగ్గింది. మండలంలోని అన్ని గ్రామాల్లో సిబ్బందితో పనులు చేపట్టి నూరు శాతం లక్ష్యాన్ని చేరుకున్నాం.