యాసంగిలో రైతు పంట పండింది
జోరుగా వరి కోతలు.. కల్లాల్లో ధాన్యపు రాశులు
మండలంలో 120 హార్వెస్టర్లు
దిగుబడి అంచనా 3లక్షల క్వింటాళ్లు
తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 21: ఒకప్పుడు యాసంగి అంటే.. ఆశలతో సాగు చేసిన పంట పొట్ట దశలో కండ్ల ముందే ఎండి రైతుకు కన్నీరే మిగిలేది. కానీ నేడు ఆ దుస్థితి దూరమైంది. అన్నదాతకు కాలం కలిసి వచ్చింది. మరోవైపు కాలువల ద్వారా వచ్చిన నీళ్లతో చెరువులు, కుంటలు నిండి భూగర్భ జలాలు పెరిగాయి. పంటలు సమృద్ధిగా పండగా, కోతలు జోరందుకున్నాయి. ధాన్యపు రాశులతో కల్లాలు కళకళలాడుతున్నాయి.
మండలంలో 18వేల ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో వరి సాగు చేశారు. ఇందులో దొడ్డు రకం వరితో పాటు సీడ్ వరిని కూడా వేశారు. ఇది గత యాసంగితో పోల్చితే ఎక్కువే. ఈసారి వర్షాకాలంలో కురిసిన వానలకు తోడు ప్రభుత్వం కాలువల ద్వారా గ్రామాల్లోని జలవనరులను నింపడం రైతుల ఆశలకు జీవం పోసింది. సిరులు పండించేందుకు ఎంతో దోహదపడింది.
రెట్టింపైన హార్వెస్టర్లు..
డిసెంబర్కు ముందు వేసిన పంటలు చేతికందాయి. ప్రస్తుతం కోతలు నడుస్తున్నాయి. మండలంలో 120 హార్వెస్టర్లు ఉండగా వాటిలో కొన్ని ఇతర ప్రాంతాల్లో కోతలకు వెళ్తాయి. అలాగే ఇతర ప్రాంతాల నుంచి కొన్ని మండలానికి వస్తుంటాయి. సాగు విస్తీర్ణంతోపాటే హార్వెస్టర్ల సంఖ్య సైతం రెట్టింపైంది. ప్రస్తుతం వాటికి గంటకు రూ.1800 నుంచి రూ.2వేల దాకా ప్రాంతాన్ని బట్టి నడుస్తున్నది.
దండిగా ధాన్యపు రాశులు
ప్రస్తుతం వరి కోతలు ప్రారంభ దశలో ఉన్నప్పటికీ ధాన్యం రాశులు దండిగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడా కళ్లాల్లోనే ఎండబెడుతున్నారు. అధికారుల అంచనా ప్రకారం.. 3లక్షల క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. క్వింటాలుకు ప్రభుత్వం రూ.1,888 ధర నిర్ణయించింది. రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఏఈవో పరిశీలించిన తర్వాతనే తూకం వేస్తున్నారు. అలాగే రైతులకు టోకెన్లు ఇచ్చి క్రమపద్ధతిలో తూకం వేసేలా ఏవో, కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే పోరండ్ల సొసైటీ పరిధిలోని అల్గునూర్, పోరండ్ల గ్రామాల్లో, ఐకేపీ ఆధ్వర్యంలో తిమ్మాపూర్లో కేంద్రాలను ప్రారంభించారు. అలాగే త్వరలోనే నుస్తులాపూర్ సొసైటీ, ఐకేపీల ఆధ్వర్యంలో మరిన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.
తాలు రాకుండా చూసుకోవాలి
వరి కోతల సమయంలో హార్వెస్టర్లోనే తాలు రాకుండా చూసుకోవాలి. వరి కోసే సందర్భంలోనే తాలు తక్కువగా వస్తే రైతుకు శ్రమ తప్పుతుంది. మండలంలో కొన్ని గ్రామాల్లో ముమ్మరంగా కోతలు నడుస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. రైతులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొనుగోలు కేంద్రంలో తూకం వేయించుకోవాలి.
జే సురేందర్, మండల వ్యవసాయాధికారి