హైదరాబాద్ : రసాయన తయారీ పరిశ్రమలోని రియాక్టర్ డ్యామేజీ అగ్నిప్రమాదంతో పాటు తీవ్ర వాయువుల లీకుకు కారణమైంది. ఈ ఘటన హైదరాబాద్ గోల్నాకలోని మారుతీనగర్లో గల డక్కన్ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. భరించరాని విధంగా ఉన్న వాయువుల లీకుతో స్థానికులు పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు వెంటనే అటు ఫైర్ సిబ్బందిని, ఇటు జీహెచ్ఎంసీ టీంకు సమాచారం అందించారు.
అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గంట వ్యవధిలో మంటలను అదుపులోకి తెచ్చింది. యాసిడిక్ పదార్థాలు కలిగిన రియాక్టర్లను కంపెనీ కలిగిఉంది. సంఘటనా స్థలంలో పలువురు ఉన్నప్పటికీ వారంతా సురక్షితంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై అంబర్పేట పోలీసులు విచారణ చేపట్టారు. జీహెచ్ఎంసీ అధికారులు యూనిట్ను సీజ్ చేశారు.