రెండో దశ కరోనా దేశాన్ని వణికిస్తున్న పరిస్థితుల్లో వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తల గురించి సర్వత్రా చర్చ సాగుతున్నది. లాక్డౌన్ ప్రకటించకుండానే కరోనాను కట్టడి చేయాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశ నెరవేరలేదు. లాక్డౌన్ అనివార్యంగా ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే దీంతోనే సరిపోదు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేది వ్యక్తిగత జాగ్రత్తలు, భౌతిక దూరం పాటించటం, విధిగా మాస్క్ ధరించటం లాంటివి ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటికే వైరస్ ఒక విస్పోటనంగా వ్యాప్తి చెందుతున్న తీరును చూస్తు న్నాం. ఇక ముందు కూడా కొత్త వైరస్ల వల్ల మరో ప్రమాదం ఉందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ప్రజానీకాన్ని హెచ్చరిస్తున్నది. కాబట్టి నియంత్రణ పాటించి ఎవరికి వారే సొంత జీవన విధానానికి అలవాటు పడాల్సిన అవసరం ఉంది. వాతావరణంలో వచ్చిన మార్పులతో గతంలోకంటే వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని ముఖ్యంగా గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే బయటి గాలి కంటే ఇంట్లో మనం వదులుతున్న గాలి ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అర్థమవుతున్నది. కాబట్టి ఇంట్లో ఉన్నప్పటికీ మాస్కు పెట్టుకొని ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
దేశంలో వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నది. దీనికి కారణం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు నామమాత్రంగా ఉండడంవల్లనే అనే అభిప్రాయం ఉన్నది. గత అనుభవాల నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించటానికి ప్రభుత్వాలు వెంటనే ముందడుగు వేయలేదు. గత ఏడాది లాక్డౌన్తో మన ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటుందన్న సమయంలో రెండో దశ వైరస్ విజృంభించటంతో ఇప్పుడు స్వయం నియంత్రణకే పెద్దపీట వేయాల్సిన అవసరముంది. అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్లకుండా ఉండాలి. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజాతోడ్పాటు లేకుండా ఏదీ విజయం సాధించలేదు. కరోనా విషయంలోనూ అది మరింత అవసరం.
వ్యవసాయ రంగం చిన్న కుటీర పరిశ్రమలపై ఎక్కువగా ఆధారపడి ఉన్న మెజారిటీ ప్రజలు ఇక్కట్ల పాలుకాకుండా చర్యలు తీసుకోవాలి. లాక్డౌన్ కారణంగా ఏ ఒక్కరూ పస్తులు ఉండే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రజా సంక్షేమాన్ని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైరస్ నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా వైద్య విధానాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. చాలా రాష్ర్టాల్లో చాలీచాలని వైద్య వసతులతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మందులు, పడకలు సరేసరి, కనీసం సరిపోను ఆక్సిజన్ అందించలేకపోవడం పెద్ద విషాదం.
తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అక్కడ ప్రభుత్వం వెంటనే వైరస్ సోకిన ప్రతి వ్యక్తికి ఉచితంగా వైద్య సదుపాయం అందించే విధంగా చర్యలు తీసుకోవటం ముదావహం.తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం వైరస్ బారిన పడిన ప్రతి వ్యక్తికి తగు వైద్యసాయం అందిం చేందుకు కృషి చేస్తున్నది. వైరస్ వ్యాప్తిని ముం దుగానే పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం తగు రీతిలో పడకలు, ఆక్సిజన్ బెడ్లు పెంచి బాధితులకు అందుబాటులోకి తెచ్చింది. అందుకే జాతీయ సగటు కన్నా తెలంగాణలో పాజిటివ్ రేట్ తక్కువగా ఉన్నది. అలాగే మరణాల రేటు కూడా తక్కువగా ఉన్నది.
ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. బయట తిరిగి వైరస్ బారిన పడి లక్షల రూపాయలు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకునే కంటే ఉన్నదేదో తిని ఇంట్లో ఉండటం మంచిదని మనకు మనంగా గ్రహించాలి. అత్యవసరం ఉంటే తప్ప బయటికి రాకుండా ఉండటమే శ్రేయస్కరం.
అనేక రకాలుగా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ విస్తరిస్తున్నది. ఈ మధ్య నే బ్లాక్ ఫంగస్ బుగులు పుట్టిస్తున్నది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మరో రకంగా ముప్పు ముంచుకొస్తున్నది. ఇప్పుడు ఇంట్లో ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ నియంత్రణ కంటే మన నియంత్రణ రెండింతలు మేలు. ఎక్కువ ప్రయోజన కరం. వ్యక్తికి- వ్యక్తికి మధ్య దూరం ఆరు ఫీట్లు ఉండేలా జాగ్రత్త పడాలి. వస్తు మార్పిడి కంటే గాలి ద్వారానే వైరస్ విస్తరణ జరుగుతుంది కాబట్టి మంచి వాతావరణంలో ఉండడమే మంచిది. ఏది ఏమైనప్పటికీ వైరస్ నియంత్రణ కోసం మనమందరం స్వీయ నియంత్రణ పాటించాలి.
ప్రభుత్వ నియంత్రణ కంటే మన నియంత్రణ రెండింతలు మేలు. ఎక్కువ ప్రయోజన కరం. వ్యక్తికి- వ్యక్తికి మధ్య దూరం ఆరు ఫీట్లు ఉండేలా జాగ్రత్త పడాలి. వస్తు మార్పిడి కంటే గాలి ద్వారానే వైరస్ విస్తరణ జరుగుతుంది కాబట్టి మంచి వాతావరణంలో ఉండడమే మంచిది. ఏది ఏమైనప్పటికీ వైరస్ నియంత్రణ కోసం మనమందరం స్వీయ నియంత్రణ పాటించాలి.
డాక్టర్. ఆర్. ఆదిరెడ్డి