గౌహతి: అస్సాం, మిజోరం సరిహద్దుల్లో సోమవారం హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ సరిహద్దు కాల్పుల్లో ఆరుగురు అస్సామీ పోలీసులు మృతిచెందారు. ఆ పోలీసుల మృతదేహాలకు ఇవాళ సీఎం హిమంత బిశ్వ శర్మ నివాళి అర్పించారు. బోర్డర్ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు సీఎం హిమంత శర్మ ప్రకటించారు. గాయపడ్డవారికి లక్ష ఇవ్వనున్నారు. అల్లర్లలో గాయపడ్డ ఎస్పీని చికిత్స కోసం ముంబై తరలించినట్లు ఆయన తెలిపారు.
ఆదివారం రాత్రి మిజోరంలోని సరిహద్దు గ్రామం వైరెంగ్తేలోని రైతులకు చెందిన ఎనిమిది గుడిసెలకు దుండగులు నిప్పుపెట్టారు. దీంతో ఆగ్రహించిన మిజోరానికి చెందిన అక్కడి స్థానికులు అస్సాం సరిహద్దు పోలీసులతో లైలాపూర్ వద్ద గొడవకు దిగారు. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో అస్సాంకు చెందిన ఆరుగురు పోలీసులు మరణించినట్టు అస్సాం సీఎం తెలిపారు. మిజోరం పోలీసులు జరిపిన కాల్పుల్లో వీరు మరణించినట్టు ఆయన ఆరోపించారు. ఉద్రిక్తతల్లో 80 మందికి పైగా పోలీసులు, స్థాని కులు గాయపడినట్టు అధికారవర్గాలు తెలిపాయి.