గువాహటి: వరల్డ్ రైనో డేను పురస్కరించుకుని అసోం ప్రభుత్వం ఇవాళ 2,479 రైనో కొమ్ములను తగులబెట్టింది. ఆ రైనో కొమ్ములన్నీ భారీ ఆకారంలో ఉండే ఒంటి కొమ్ము రైనోలకు సంబందించినవే. మరణించిన రైనోల కొమ్ములను పోగుచేసి ఇవాళ గోళాఘాట్లో ఒకేసారి వాటిని తగులబెట్టారు. అయితే, అసోం ప్రభుత్వం ఇలా చేయడం వెనుక ఒక గొప్ప సదుద్దేశం ఉన్నది. రైనోలను సంరక్షించుకునే సంకల్పం ఉన్నది.
చాలాకాలంగా రైనోల కొమ్ములకు ఔషధ ప్రాముఖ్యం ఉన్నదన్న ప్రచారం ఉన్నది. దాంతో వేటగాళ్లు అటవీ అధికారుల కళ్లుగప్పి రైనోలను వేటాడుతున్నారు. అత్యంత కిరాతకంగా వాటిని చంపి, కొమ్ములు ఊడదీసుకుని పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో రైనో కొమ్ములకు ఎలాంటి ఔషధ ప్రాముఖ్యత లేదని వేటగాళ్లకు బలమైన సందేశం ఇవ్వడం కోసం అసోం సర్కారు ఇలా చేసింది.