హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉధృతమైంది. రోజువారీ కేసుల సంఖ్య 5 వేలు దాటింది. మరోవైపు కరోనా, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 1.29 లక్షల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 5,093 మందికి పాజిటివ్గా తేలినట్టు ఆదివారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 743, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 488, రంగారెడ్డిలో 407, నిజామాబాద్ 367, కామారెడ్డి, సంగారెడ్డిలో 232 చొప్పున, జగిత్యాలలో 223, వరంగల్ అర్బన్ 175, మహబూబ్నగర్లో 168, ఖమ్మంలో 155, కరీంనగర్లో 149, నల్లగొండ, నిర్మల్లో 139 చొప్పున, మంచిర్యాలలో 124, వికారాబాద్లో 122, సిద్దిపేటలో 117, రాజన్న సిరిసిల్లలో 106, మెదక్, నాగర్కర్నూల్లో 101 చొప్పున కేసులు వెలుగుచూశాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్రంలో రికవరీ రేటు 88.94 శాతానికి తగ్గగా, జాతీయ సగటు 86.6 శాతానికి పడిపోయింది. రాష్ట్రంలో ప్రస్తుతం 37,037 మంది ఇండ్లు, దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు 35,922 పరీక్షలు నిర్వహించగా, 6,582 కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతూ 22 మంది మృతి చెందినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
లక్షన్నర మందికి టీకాలు
రాష్ట్రంలో శనివారం 1.50 లక్షల మందికి కరోనా టీకాలు వేశారు. ఇందులో 1.39 లక్షల మంది తొలిడోస్ తీసుకోగా, 10 వేల మంది రెండోడోస్ తీసుకున్నారని ఆదివారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు 29.52 లక్షల మందికి టీకాలు వేయగా, తొలిడోస్ తీసుకున్నవారి సంఖ్య 28 లక్షలు దాటింది.
రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు
అంశం –శనివారం -మొత్తం
పాజిటివ్స్- 5,093– 3,51,424
డిశ్చార్జి –1,555– 3,12,563
మరణాలు –15– 1,824
యాక్టివ్ కేసులు – 37,037