గువహటి : బీజేపీలో ఇతర పార్టీల నుంచి చేరికలు కొనసాగుతాయని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రూప్జ్యోతి కుర్మి కాషాయ పార్టీలో చేరడాన్ని ఆయన స్వాగతించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ అభ్యున్నతికి చేపట్టిన కార్యక్రమాలను చూసి పలువురు ఇతర పార్టీల నేతలు కాషాయ గూటికి చేరుతున్నారని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి బీజేపీలో పలువురు నేతలు బీజేపీలో చేరడం మొదలైందని, రాబోయే రోజుల్లోనూ చేరికలు కొనసాగుతాయని ధేమజి జిల్లాలో సోమవారం జరిగిన పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. యువ నేత కుర్మి తేయాకు కార్మికులు, పరిశ్రమ ప్రగతికి పనిచేయడమే కాకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే నేత అని సీఎం శర్మ కొనియాడారు.