గౌహతి: ఆలయానికి 5 కిలోమీటర్ల దూరం పరిధిలో.. ఇక నుంచి ఆవు మాంసాన్ని అమ్మడం ( Beef Sale ) కానీ, ఆవులను చంపడం కానీ నిషేధం. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది. గోవుల సంరక్షణ బిల్లుకు శుక్రవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో పచ్చ జెండా ఊపింది. దీంతో హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఎన్నికల హామీని నెరవేర్చినట్లు అయ్యింది. బిల్లుపై చర్చ సమయంలో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. హిందువులు, జైన్లు, సిక్కులతో పాటు బీఫ్ తినని మతస్తులు ఉండే ప్రాంతాల్లో కబేళాలు ఉండరాదు అని ఆ బిల్లులో పేర్కొన్నారు. కానీ కొన్ని మతపరమైన సందర్భాల్లో మాత్రం మినహాయింపు ఇవ్వనున్నారు. ఆలయాలు, గురుద్వారాలకు 5 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి గోవధ చేయకూడదని బిల్లులో స్పష్టం చేశారు. సరైన డాక్యుమెంట్లు లేకుండా గోవులను తరలిస్తే, చట్ట రీత్యా శిక్ష అమలు చేయనున్నారు. దీని వల్ల అక్రమ గో వ్యాపారాన్ని అడ్డుకోవచ్చు అని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. గో సంరక్షణ బిల్లులో ఎటువంటి దుర్దేశం లేదని, ఇది మతపరమైన సహనాన్ని కల్పిస్తుందన్నారు.