హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చేప పిల్లల పంపిణీ, మత్స్యకారుల అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమాధానం ఇచ్చారు. సమైక్య రాష్ర్టంలో మత్స్యకారులను గుర్తించలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మత్స్యకారులను గుర్తించారు. కులవృత్తుల మీద ఆధారపడ్డ వారి అభివృద్ధికి సీఎం చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నీలి విప్లవం తీసుకొచ్చారు. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో చేపలు పెంచాలని తమ డిపార్ట్మెంట్కు ఆదేశాలు ఇచ్చి బడ్జెట్లో నిధులు కేటాయించారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు చిన్న నీటి వనరుల్లో చేప పిల్లలను ఉచితంగా విడుదల చేసి మత్స్యకారులను ఆదుకుంటున్నామని తెలిపారు. రూ. 525 కోట్లతో మోపెడ్ వాహనాలతో పాటు జాలర్లకు వసతులు కల్పించామన్నారు. చేపల విక్రయానికి మార్కెట్లు పెంచుతామని చెప్పారు. మొబైల్ ఔట్లెట్లు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. వీటిని రేపు ప్రారంభిస్తున్నామని చెప్పారు. రాష్ర్టంలోని మత్స్యకారులను ఆదుకుంటూ.. గతానికి భిన్నంగా సంపదను పెంచారు. తెలంగాణ రాష్ర్టంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మత్స్యకారులు గౌరవంగా బతుకుతున్నారు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.