న్యూఢిల్లీ, జూలై 6: కొవిడ్-19 కారణంగా వాయిదా పడిన జేఈఈ -మెయిన్ రెండు సెషన్ల పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మూడో సెషన్ పరీక్ష జూలై 20 నుంచి 25 వరకు, నాలుగో సెషన్ పరీక్ష జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం వెల్లడించారు. పరీక్షల ఫలితాలను ఆగస్టులో వెల్లడించే అవకాశమున్నదని చెప్పారు. మూడు, నాలుగు సెషన్ల పరీక్షల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నవారు మారిన షెడ్యూల్కు అనుగుణంగా మళ్లీ రిజిష్టర్ కావాలని సూచించారు. కరోనా నేపథ్యంలో రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు కూడా తాజాగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మూడో సెషన్ కోసం మంగళవారం నుంచి జూలై 8 రాత్రి 9 గంటల వరకు, నాలుగో సెషన్ కోసం శుక్రవారం నుంచి జూలై 12 రాత్రి 9 గంటల వరకు https://jeemain.nta.nic.in/ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. కరోనా నేపథ్యంలో పరీక్ష నిర్వహణ ప్రాంతాలను 232 నుంచి 334కు, పరీక్షా కేంద్రాలను 660 నుంచి 828కి పెంచుతున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సీనియర్ డైరెక్టర్ సాధన పరాషార్ తెలిపారు. ఏప్రిల్లో నిర్వహించాల్సిన మూడో సెషన్కు 6.80 లక్షల మంది, మేలో నిర్వహించాల్సిన నాలుగో సెషన్కు 6.09 లక్షల మంది రిజిస్టరైనట్టు వెల్లడించారు. ఐఐటీ, నిట్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. విద్యార్థులు మార్కుల శాతాన్ని పెంచుకోవడానికి జేఈఈ మెయిన్ను నాలుగు సెషన్లలో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.