న్యూఢిల్లీ, ఆగస్టు 14: జమ్ముకశ్మీర్ ఏఎస్ఐ బాబూ రామ్ను అశోకచక్ర అవార్డు, కానిస్టేబుల్ అల్తాఫ్ హుస్సేన్ భట్ను కీర్తిచక్ర అవార్డులతో కేంద్రప్రభుత్వం గౌరవించింది. ఇద్దరూ వృత్తి నిర్వహణలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలారు. ఆదివారం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సాయుధ బలగాలు, పోలీసులు, పారామిలిటరీ బలగాలకు కేంద్రం అవార్డులు ప్రకటించింది. తమ విధి నిర్వహణలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి ఇచ్చే అత్యున్నత అవార్డు(పీస్టైమ్ గ్యాలంట్రీ అవార్డు) అశోక చక్ర, దీని తర్వాత స్థానంలో వచ్చేది కీర్తి చక్ర. 1972 మే 15న జన్మించిన బాబూరామ్ 1999లో జమ్ముకశ్మీర్ పోలీస్ విభాగంలో చేరారు. 2002 జూలై 27 ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందంలో నియమితులయ్యారు. 14 ఎన్కౌంటర్లలో పాల్గొన్నారు. బాబూరామ్ పాల్గొన్న ఆపరేషన్లలో 28 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. గతేడాది ఆగస్టులో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో పాల్గొని అమరులయ్యారు. కానిస్టేబుల్ భట్ శ్రీనగర్కు చెందినవారు. గతేడాది అక్టోబర్ 6న ఉగ్రవాదుల దాడి నుంచి ఓ వ్యక్తిని కాపాడటానికి వీరోచితంగా పోరాడారు. ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఈ క్రమంలో ఆయనకు బుల్లెట్ గాయాలు కావడంతో తర్వాత మరణించారు. శనివారం ప్రకటించిన అవార్డులో 15 శౌర్యచక్ర, నాలుగు బార్ టు సేన, 116 సేనా మెడల్స్ ఉన్నాయి. మొత్తం 15 శౌర్యచక్రల్లో నలుగురికి మరణించిన తర్వాత అవార్డులు ప్రకటించారు. 1,380 మందికి పోలీసు మెడల్స్ ప్రకటించారు. వీటిలో 628 గ్యాలంట్రీ మెడల్స్. 88 ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ ఉన్నాయి. తెలంగాణ నుంచి 14 మందికి పోలీస్ మెడల్స్ వచ్చాయి.