న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తుకు సిద్ధమని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పదవి ముస్లింకు కేటాయిస్తే ఎస్పీతో పొత్తుకు సిద్ధమని ఆయన తేల్చిచెప్పారు. ఆగస్ట్లో అసదుద్దీన్ ఓవైసీ యూపీలో పర్యటిస్తారని భావిస్తున్నారు. కాగా, ఎంఐఎం ఇప్పటికే ఓంప్రకాష్ రాజ్భర్ నేతృత్వంలోని చిన్నపార్టీలతో కూడిన భాగిదరి సంకల్ప్ మోర్చాతో పొత్తుకు సిద్ధమైంది. ఇక అన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు డిప్యూటీ సీఎం పదవులను కట్టబెట్టాలని ఎంఐఎం నేత ఆసిం వకార్ కోరారు.
ఈ అంశంపై కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ తమ వైఖరిని వెల్లడించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓం ప్రకాష్ రాజ్భర్ తమ ప్రతిపాదనకు విముఖత చూపలేదని పేర్కొన్నారు. మరోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నికలతో చిన్న పార్టీలతో కలిసి వెళతామని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దళిత వ్యతిరేక వైఖరితో పెద్ద పార్టీలు ఎస్పీని దూరం పెట్టడంతోనే విధిలేని పరిస్ధితుల్లో అఖిలేష్ చిన్న పార్టీల వెంటపడుతున్నారని బీఎస్పీ చీఫ్ మాయావతి ఎద్దేవా చేశారు.