న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ బుధవారం తన క్యాబినెట్ను విస్తరించారు. మోదీ సారధ్యంలోని కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్న వారిలో మహారాష్ట్ర, అసోం రాష్ట్రాల మాజీ సీఎంలు నారాయణ రాణె, శర్బానంద సోనోవాల్ ఉన్నారు. మహారాష్ట్రలో శివసేన- బీజేపీ సంకీర్ణ కూటమి సారధిగా మనోహర్ జోషి వైదొలగడంతో 1999లో స్వల్ప కాలం పాటు సీఎంగా నారాయణ రాణె పని చేశారు.
తన 20వ ఏండ్ల వయస్సులోనే శివసేనలో శాఖా ప్రముఖ్గా రాజకీయ ఆరంగ్రేటం చేశారు. అటుపై 1990-2004 వరకు శివసేన తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2005లో శివసేనకు రాజీనామా చేసి,కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందారు.
2005 తర్వాత ప్రుథ్వీరాజ్ చవాన్, అశోక్ చవాన్ క్యాబినెట్లలో మంత్రిగా రాణె పని చేశారు. 2017లో కాంగ్రెస్ పార్టీని వీడిన నారాయణ రాణె.. మహారాష్ట్ర స్వాభిమాన్ పక్షను స్థాపించారు. 2018లో బీజేపీకి మద్దతు పలికి.. రాజ్యసభకు ఎన్నికయ్యారు. అటుపై తన మహారాష్ట్ర స్వాభిమాన్ పక్షను బీజేపీలో విలీనం చేశారు.
అసోం మాజీ సీఎం శర్బానంద సోనోవాల్ కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేయడం ఇది రెండోసారి. 2014 ఎన్నికల్లో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ విజయం తర్వాత తొలి మోదీ క్యాబినెట్లో క్రీడల శాఖ మంత్రిగా 2016 వరకు పని చేశారు.
2016లో జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు సోనోవాల్. ఇటీవల అసోం రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినా.. హిమంత్ బిశ్వ శర్మ.. సీఎంగా నియమితులయ్యారు.
దీంతో శర్బానంద సోనోవాల్ను ప్రధాని మోదీ తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. శర్బానంద సోనోవాల్.. 1992-99 మధ్య అఖిల అసోం విద్యార్థి సంఘం (అసు) అధ్యక్షుడిగా పని చేశారు. తర్వాత అసోం గణపరిషత్ (ఏజీపీ) సభ్యుడయ్యారు. 2001లో ఎమ్మెల్యేగా, 2004లో ఎంపీగా ఎన్నికయ్యారు.
2009లో ఓటమి తర్వాత శర్బానంద సోనోవాల్.. 2011లో బీజేపీలో చేరారు. 2012లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2014 ఎన్నికల్లో లఖింపూర్ స్థానం నుంచి విజయం సాధించారు.