సౌథాంప్టన్: ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ను వర్షం వదిలేలా లేదు. మూడో రోజు ఆదివారం కూడా మ్యాచ్కు వర్షం అడ్డుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే తొలి రోజు మొత్తం తుడిచిపెట్టుకుపోగా.. రెండో రోజు కూడా పూర్తి ఆట సాధ్యం కాలేదు. ఇక అక్యువెదర్ అనే వాతావరణ వెబ్సైట్ ప్రకారం.. ఆదివారం మొత్తం ఆకాశం మేఘావృతమై, మధ్యమధ్యలో వర్షం పడే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్కు అంతరాయాలు తప్పేలా లేవు. ఆ లెక్కన పూర్తి రోజు ఆట అసాధ్యమనే చెప్పాలి.
రెండో రోజు టాస్ గెలిచి న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. తమ పేసర్లకు అనుకూలించే వాతావరణం ఉన్నా కూడా కివీస్ టీమ్ పూర్తిగా లబ్ధి పొందలేకపోయింది. ఇండియన్ టీమ్కు రోహిత్, గిల్ జోడీ తొలి వికెట్కు 62 పరుగుల భాగస్వామ్యం అందించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లి 44, రహానే 29 పరుగులతో క్రీజులో ఉన్నారు.