ఆంతరంగికంగానే హనుమాన్ పెద్ద జయంతి
ఆలయంలోనే నిరాడంబరంగా ఉత్సవాలు
అభిషేకాలు, ప్రత్యేక పూజలు
త్రయాహ్నిక తికుండాత్మక యాగం, పూర్ణాహుతి
స్వామివారికి పట్టువస్ర్తాలు పంపిన ఎమ్మెల్సీ కవిత
మల్యాల, జూన్ 4: కొండగట్టు ఆంజనేయస్వామి పెద్ద జయంతి వేడుకలు శుక్రవారం ఆలయంలోనే అర్చకుల సమక్షంలో జరిగాయి. ఏటా వేలాది మంది భక్తుల మధ్య జరిగే ఉత్సవాలు ఈసారి కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహించారు. వైశాఖ బహుళ దశమిని పురస్కరించుకొని శుక్రవారం హనుమాన్ పెద్ద జయంతి వేడుకలను ఆలయంలోనే జరిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక దూతల ద్వారా స్వామివారికి పట్టువస్ర్తాలు, పూలు, పండ్లు, తలంబ్రాలను పంపించగా వారు స్వామివారి ఆలయంలో అధికారులకు అప్పగించారు. పెద్ద జయంతి సందర్భంగా అర్చకులు ఉద యం 3 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, ద్రావిడ పారాయణాలు చేసి చందనాలంకరణ చేశారు. అనంతరం స్వామి వారికి బాలబోగం, గిన్నె తీర్థం అందజేశారు. ఉదయం 10 గంటలకు తులసీ అర్చన చేసిన అనంతరం మంగళవాయిద్యాలతో అర్చకులు పుష్కరిణి నుంచి బిందెలతో నీరు తెచ్చి స్వామి వారి మూల విరాట్కు అభిషేకం, పంచామృతాభిషేకం, సహస్ర నాగవల్లి అర్చన వంటి పూజలు నిర్వహించారు. యాగశాలలో ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తికి మంగళ స్నానం చేయించి, నూతన పట్టువస్ర్తాలతో అలంకరించి ఊయల సేవ చేశారు. సాయం త్రం స్వామి వారికి ఆరాధన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చన చేసి ఒడిబియ్యం సమర్పించి ఆలయంలో సహస్రదీపాలు వెలిగించారు. శ్రీ స్వామివారిని గరుడవాహనంపై ఆలయ వీధుల గుండా ఊరేగించారు. చివరగా కంకణోద్వాసన కార్యక్రమా న్ని నిర్వహించి మంత్రపుష్పం, మహానివేదన సమర్పించా రు. యాగశాలలో త్రయాహ్నిక త్రికుండాత్మక యజ్ఞాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకుడు శ్రీనివాసశర్మ, ఆలయ ఇన్స్పెక్టర్లు రాజేశ్వర్రావు, స్థానాచార్యులు జితేంద్రప్రసాద్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, మారుతీస్వామి, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవస్వామి, తదితరులు పాల్గొన్నారు.
కోతులకు ఆహారం పంపిణీ..
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పలువురు కొండగట్టులో హనుమాన్ జయంతి సందర్భంగా కోతులకు పండ్లు, పుట్నాలు, ప్యాలాలు, బెల్లం తదితర ఆహార వస్తువులను అందజేశారు.