న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్గా అరవింద్ కేజ్రీవాల్ తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ అత్యున్నత పదవిని ఢిల్లీ సీఎం మరోసారి దక్కించుకున్నారు. పార్టీ జాతీయ కార్యదర్శిగా పంకజ్ గుప్తా తిరిగి ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడు ఎన్డీ గుప్తా కోశాధికారిగా ఎన్నికైనట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఆప్ జాతీయ మండలి వార్షిక సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా 34 సభ్యుల కార్యనిర్వాహక మండలిని ఎన్నకున్నారు. అనంతరం కొత్తగా ఎన్నికైన కార్యనిర్వాహక మండలి తొలి సమావేశం జరిగింది. ఈ రెండు కార్యక్రమాలు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగినట్లు ఆ పార్టీ తెలిపింది.
రానున్న రెండేళ్లలో పార్టీని దేశ రాజధాని ఢిల్లీని మించి విస్తరించాలని ఆప్ నిర్ణయించింది. పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో కొత్త కార్యనిర్వాహక మండలిని ఎన్నుకున్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలనలో ఉన్న ఢిల్లీ నగరంలోని మూడు పురపాలికల్లో వచ్చే ఏడాది జరుగనున్న మున్సినపల్ ఎన్నికలపైగా ఆప్ దృష్టిసారించింది.
కాగా, కరోనా వల్ల ఆలస్యమైన మునుపటి జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ఆప్ ఈ ఏడాది జనవరిలో నిర్వహించింది. జాతీయ కన్వీనర్, సెక్రటరీ పదవుల పదవీకాలాన్ని మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల వరకు పొడిగించే తీర్మానాలను ఆమోదించారు. ఈ పోస్టులలో ఒకే వ్యక్తి రెండు పర్యాయాలకు పైగా తిరిగి ఎన్నిక కావడాన్ని నిషేధించే నిబంధనను తొలగించారు. దీంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ జాతీయ కన్వీనర్గా మూడోసారి ఎన్నికయ్యారు.