డెహ్రాడూన్: త్వరలో ఎన్నికలు జరుగనున్న ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాలుగు హామీలు ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ కోతలు ఉండవన్నారు. ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని, పాత బకాయిలను మాఫీ చేస్తామని, రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్కు సంబంధించిన ఈ నాలుగు హామీలు తప్పక నెరవేరుస్తామని వెల్లడించారు. ఇవి ఎన్నికల తాయిలాలు కావని చెప్పారు.
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఆదివారం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. బీజేపీ, కాంగ్రెస్పై మండిపడ్డారు. 2000 నుంచి ఈ రెండు పార్టీలు ఒక ఒప్పందంతో ఒకదాని తర్వాత మరొకటి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకుని నాశనం చేశాయని ఆరోపించారు. అధికార బీజేపీకి సీఎం లేరని విమర్శించారు. 70 ఏండ్లలో తొలిసారి తమ సీఎం పనికిరాని వ్యక్తిగా ఆ పార్టీ నేతలే చెబుతున్నారని అన్నారు.
మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్కు కూడా సరైన నాయకుడు లేరని కేజ్రీవాల్ విమర్శించారు. నాయకుడ్ని ఎన్నుకునేందుకు ఆ పార్టీ నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాఖండ్ ప్రజల అభివృద్ధి గురించి ఎవరు ఆలోచిస్తారు, అధికారం కోసం పోట్లాడుకునే ఈ పార్టీలు ప్రజల బాగోగుల గురించి పట్టించుకుంటాయా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
ఉత్తరాఖండ్లో 70 ఏండ్లుగా చేయలేని ఎన్నో పనులను ఢిల్లీలో పూర్తి చేసి చూపించామన్నారు. అందుకే ఉత్తరాఖండ్ ప్రజలు ఆప్ను ఈ రాష్ట్రానికి తీసుకురావాలని నిర్ణయించారని అన్నారు. మంచి స్కూళ్లు నిర్మించడంతోపాటు, విద్యుత్, తాగునీరు, వ్యవసాయం వంటి ఎన్నో అంశాలపై ఈ రాష్ట్ర ప్రజలకు గట్టి నమ్మకం కలిగిస్తామని కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు.