ఆగస్టు 5 ముందురోజు రాత్రి కాంగ్రెస్ విప్ను సంప్రదించిన బీజేపీ
రాజీనామా చేయాలంటూ సూచన.. మరుసటిరోజే రిజైన్ చేసిన కాలితా
న్యూఢిల్లీ, ఆగస్టు 6: జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసి ఇటీవలే రెండేండ్లు పూర్తయ్యింది. అయితే, రాజ్యసభలో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆమోదం పొందేందుకు అధికార బీజేపీ వ్యూహాత్మక ప్రణాళికలు రచించినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తాజాగా తెలిసింది. ఇందులో భాగంగా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన 2019 ఆగస్టు 5కు ముందురోజు రాత్రి అప్పటి కాంగ్రెస్ చీఫ్ విప్ భువనేశ్వర్ కాలితాను ఢిల్లీలోని ఆయన నివాసంలో బీజేపీ నేతలు కలిసి సంప్రదింపులు జరిపారు. ఈయనతో పాటు సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎంపీలు సురేంద్రసింగ్, సంజయ్ సేత్తో కూడా రాయబారం నడిపారు. వారి సూచనల మేరకు ఆ మరుసటి రోజునే కాలితాతో పాటు సురేంద్రసింగ్, సంజయ్ సేత్ రాజీనామా చేశారు. రాజ్యసభలో తగిన బలంలేకపోవడం, బిల్లును ఆమోదించే సమయంలో కాంగ్రెస్ విప్ ఓటింగ్కు పట్టుబట్టే అవకాశం ఉండటం తదితర కారణాలను గ్రహించే బీజేపీ ఈ ప్రణాళిక రచించిందని తెలుస్తున్నది. కాగా, ఒకవేళ కాలితా విప్ పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించకపోతే, ఆయన్ని ఒప్పించేందుకు కాలితా కుటుంబసభ్యులను కూడా ‘ప్లాన్ బీ’లో భాగంగా బీజేపీ సిద్ధం చేసినట్టు సమాచారం.