కోల్కతా: కాషాయ పార్టీ మతతత్వ విధానాలు, బెదిరింపు రాజకీయాలే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రాజకీయంగా ఉపకరించాయని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. బీజేపీని కేవలం దీదీయే మట్టికరిపించలేదని, ఎంకే స్టాలిన్, కేజ్రీవాల్, పినరయి విజయన్ వంటి ప్రాంతీయ పార్టీల నేతలు ఆయా రాష్ట్రాల్లో ఓడించారని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకత్వం అనుసరించే మతతత్వ, అణిచివేత వైఖరితో మమతా బెనర్జీ లాభపడ్డారని చెప్పారు. కాషాయ పార్టీ తీరు తోనే బెంగాల్ ఎన్నికల్లో దీదీ లాభపడ్డారని పేర్కొన్నారు.
బీజేపీపై, ఆ పార్టీ ఎన్నికల యంత్రాంగంపై దీదీ దీటుగా పోరాడారు..అద్భుత విజయం సాధించారు..కానీ చాలా మంది ప్రాంతీయ నేతలు కాషాయ పార్టీని ఓడించారన్న విషయం గుర్తెరగాలని అధిర్ అన్నారు. బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్ లేకుండా మహాకూటమి ఏర్పాటు విజయం సాధించలేదని విపక్షాలకు హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉనికితో అతిపెద్ద విపక్ష పార్టీగా ఉందని గుర్తుచేశారు.