జయశంకర్ భూపాలపల్లి : పల్లె ప్రగతి ద్వారా పరిశుభ్రత, పచ్చదనంతో పట్టణాలు, గ్రామాలు స్వయం సమృద్ధ ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని రేగొండ మండలం చెన్నాపురం, రేపాక గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని డబల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూపాలపల్లి నియోజక వర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గతంలో రేగొండ మండలం అభివృద్ధిలో వెనుకంజలో ఉండేదని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మండలం అభివృద్ధి పదంలో ముందుకు పోతుందన్నారు.
జిల్లా అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.