న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 2020 మార్చి 1 నాటికి 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. కేంద్రంలోని అన్ని శాఖల్లో మంజూరైన పోస్టులు గతేడాది మార్చికి 40,04,941గా ఉన్నట్టు తెలిపారు. 2020 మార్చి 1 నాటికి 31,32,698 మంది విధుల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. మొత్తం 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు గురువారం రాజ్యసభలో ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గడిచిన ఐదేండ్లలో మూడు ప్రధాన ఏజెన్సీల ద్వారా కొన్ని నియామకాలు చేపట్టినట్టు తెలిపారు. 2016-17 నుంచి 2020-21 వరకు యూపీఎస్సీ ద్వారా 25,267 పోస్టులు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 2,14,601 పోస్టులు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 2,04,945 పోస్టులు భర్తీచేసినట్టు ఆయన వెల్లడించారు. రిజర్వేషన్ క్యాటగిరీలవారీగా ఎస్సీ విభాగంలో 14,366, ఎస్టీలో 12,612, ఓబీసీలో 15,088 బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించారు.
తాము అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2014లో ప్రధాని మోదీ ప్రకటించారు. వాస్తవానికి ఆ పరిస్థితులు కనబడటంలేదు. కేంద్రప్రభుత్వంలోని వివిధ శాఖల్లో భర్తీచేయని పోస్టుల సంఖ్య గత ఐదేండ్లలో రెట్టింపు అయింది. కేంద్ర ఆర్థిక శాఖ కింద పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో మంజూరైనప్పటికీ కేంద్రప్రభుత్వ శాఖల్లో భర్తీచేయని పోస్టులు 11.57 శాతంగా (4,21,658 పోస్టులు) ఉంటే, 2019-20 నాటికి 21.77 శాతానికి (8,72,243 పోస్టులు) చేరింది. కేంద్రవిశ్వవిద్యాలయాలు, ఐఐటీ/ఐఐఎం, కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఉన్నతవిద్యా సంస్థల్లో దాదాపు 37 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం.