అహ్మదాబాద్: తౌటే తుఫాన్ ప్రభావం గుజరాత్పై తీవ్రంగానే ఉన్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు. తుఫాన్ ప్రభావంతో వీస్తున్న బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం ధాటికి రాష్ట్రంలోని తీర ప్రాంతం అంతా అతలాకుతలం అయ్యిందని ఆయన చెప్పారు. తుఫాన్ కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఇప్పటివరకు ముగ్గురు మృతిచెందినట్లు సీఎం రూపానీ వెల్లడించారు.
తౌటే తుఫాన్ సృష్టించిన బీభత్సంవల్ల గత రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 వేల వృక్షాలు నేల కూలాయని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు. అదేవిధంగా సుమారుగా 16,500 గుడిసెలు కొట్టుకుపోయాయని చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.