న్యూఢిల్లీ: ఇండియాలో తన వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం జైడస్ కాడిలా గురువారం దరఖాస్తు చేసుకుంది. జైకొవ్-డీ అని పిలిచే ఈ వ్యాక్సిన్కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది సూది లేని వ్యాక్సిన్ కావడం తొలి విశేషమైతే.. ప్రపంచంలోనే తొలి ప్లాస్మిడ్ డీఎన్ఏ కొవిడ్-19 వ్యాక్సిన్ కావడం మరో విశేషం. అంతేకాదు ఇండియాలో 12 నుంచి 18 ఏళ్ల వయసు వారిపై ప్రయోగాలు చేసిన తొలి కరోనా వ్యాక్సిన్ కూడా ఇదే. మరి దీని గురించి మరిన్ని విశేషాలేంటో ఒకసారి చూద్దాం.
సూది లేకుండా ఎలా?
సూది లేని వ్యాక్సిన్ అంటేనే చాలా మందిలో అదేంటోనన్న ఆసక్తి కనిపిస్తుంది. ఇప్పుడు జైడస్ కాడిలా తమ వ్యాక్సిన్ కూడా నీడిల్ ఫ్రీ అని ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ను ఇవ్వడానికి ప్రత్యేకంగా ఓ అప్లికేటర్ను ఆ సంస్థ తీసుకొస్తోంది. ఈ అప్లికేటర్ను ఫార్మాజెట్ అనే సంస్థతో కలిసి జైడస్ అభివృద్ధి చేసింది. తమ వ్యాక్సిన్ వల్ల ఏమాత్రం నొప్పి కలగదని ఈ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. సూది మందు అంటే భయపడే వారికి ఇది ఒకరకంగా గుడ్న్యూసే.
డీఎన్ఏ వ్యాక్సిన్ అంటే ఏంటి?
ఈ డీఎన్ఏ వ్యాక్సిన్ కాకుండా ఇప్పటికే మార్కెట్లో ఫైజర్, మోడెర్నాలాంటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ డీఎన్ఏ, ఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు రెండూ సాంప్రదాయ వ్యాక్సిన్లలాగే పని చేస్తాయి. కాకపోతే వైరల్ వెక్టార్ లేదంటే క్రియారహిత వ్యాక్సిన్లయిన కొవిషీల్డ్, కొవాగ్జిన్లను అభివృద్ధి చేసిన విధానంతో పోలిస్తే ఇవి భిన్నం. డీఎన్ఏ, ఆర్ఎన్ఏ వ్యాక్సిన్లలో నేరుగా వైరస్ సొంత జన్యువులనే కొంత మేర ఉపయోగించి రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తారు.
ఈ డీఎన్ఏ వ్యాక్సిన్లను ఇచ్చిన తర్వాత అది శరీరంలోకి వెళ్లి ఆర్ఎన్ఏగా మారుతుంది. అది వైరల్ ఆర్ఎన్ఏ నిర్మాణాన్ని తలపిస్తూ.. శరీర రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. అదే ఆర్ఎన్ఏ వ్యాక్సిన్లయితే నేరుగా వైరల్ జెనెటిక్ మెటీరియల్ రూపంలోనే అంటే ఆర్ఎన్ఏనే శరీరంలోకి పంపిస్తారు. ఆ లెక్కన చూస్తే డీఎన్ఏ వ్యాక్సిన్ల కంటే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు ఒక దశ ముందే ఉంటాయి. కానీ మనిషి ప్రధాన జెనెటిక్ మెటీరియల్ డీఎన్ఏ కాబట్టి.. ఈ డీఎన్ఏ వ్యాక్సిన్లు మరింత సురక్షితమని, అదే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లను శరీర రక్షణ వ్యవస్థ ఒక్కోసారి ఆమోదించకపోవచ్చని ఈఎస్ఐసీ హాస్పిటల్ డాక్టర్ శ్రేయోసి సాహా చెప్పారు.
జైకొవ్-డీ సమర్థత ఎంత?
ఇండియాలోని 12-18 ఏళ్ల వయసున్న వెయ్యి మందిపై తమ వ్యాక్సిన్ను ప్రయోగించి చూసినట్లు జైడస్ కాడిలా వెల్లడించింది. తమ ఫేజ్ 1/2, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ను స్వతంత్ర సంస్థ అయిన డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్ పర్యవేక్షించినట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రయోగాల్లో తమ వ్యాక్సిన్ పూర్తి సురక్షితమని తేలినట్లు కూడా జైడస్ స్పష్టం చేసింది.
ఈ వ్యాక్సిన్ సామర్థ్యం 66.6 శాతంగా తేలినట్లు తెలిపింది. పైగా తాము వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో అనుసరించిన ప్లాస్మిడ్ డీఎన్ఏ విధానం వల్ల వ్యాక్సిన్ కొత్త మ్యుటేషన్లను కూడా సమర్థంగా ఎదుర్కోగలదని చెప్పింది.
మూడు డోసుల వ్యాక్సిన్
ఇప్పుడున్న వ్యాక్సిన్లకు, దీనికి ఉన్న మరో ప్రధాన తేడా ఇదే. ఈ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. 28 రోజుల వ్యవధిలోనే మూడు డోసుల వ్యాక్సిన్ ఇస్తారు. డోసుకు 3 ఎంజీ చొప్పున తాము రెండు డోసుల విధానాన్ని కూడా పరీక్షించి చూసినట్లు సంస్థ తెలిపింది.
దీనికి 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్లో స్టోర్ చేసుకునే వీలుండటం మరో సానుకూల అంశం. దీనివల్ల వాటి రవాణా, స్టోరేజ్ సులువై వృథా కూడా తగ్గుతుందని జైడస్ సంస్థ చెబుతోంది. తమకు అనుమతులు లభిస్తే.. ఈ ఏడాదిలోనే 5 కోట్ల డోసులు ఇస్తామని కూడా స్పష్టం చేసింది.