ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో అదనపు బెడ్లు ఏర్పాటు
అత్యవసర సేవలకు యుద్ధప్రాతిపదికన సౌకర్యాలు
కరోనా బాధితుల డిశ్చార్జి, చేరికలపై పకడ్బందీ వ్యూహం
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో దవాఖానల సామర్థ్యం పెంపు
వైద్యశాలల్లో దోపిడీ నివారణకు ప్రభుత్వం సరికొత్త ఉపాయం
నిజామాబాద్, ఏప్రిల్ 21, (నమస్తే తెలంగాణ ప్రతినిధి):సురేశ్కు నలభై సంవత్సరాలు. చిన్నపాటి కరోనా లక్షణాలు ఉండడంతో లైట్ తీసుకున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. గమనించిన కుటుంబీకులు వెంటనే దవాఖానకు తరలించేందుకు సిద్ధమయ్యారు. అంబులెన్సు వచ్చింది. బాధితుడిని ఎటు తీసుకెళ్లాలో తెలియని అయోమయం. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. పేరొందిన దవాఖానకు వెళ్లగా… బెడ్లు ఖాళీగా లేవంటూ సమాధానం. వెంటనే మరో దవాఖానకు ఇలా… ఒకటి కాదు రెండు కాదు… దొరికిన అడ్రస్ను పట్టుకుని తిరగసాగారు. చివరికి అదృష్టం కొద్దీ ఓ దవాఖానలో రూ.50వేలు డిపాజిట్ చేసి వెంటనే బెడ్ను బుక్ చేసుకుని అడ్మిట్ అయ్యారు. ఆక్సిజన్ అందించి చికిత్స ప్రారంభించడంతో సురేశ్ ప్రాణాలు నిలబడ్డాయి. ఇలా గ్రామాల నుంచి కరోనా బారిన పడి చివరి నిమిషంలో వస్తున్న బాధితులు అనేక మంది. వీరందరికీ ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఉండబోవు. ప్రభుత్వం ఓ ఉపాయాన్ని ఆలోచించింది. తెలంగాణ ఆరోగ్య శాఖ వెబ్సైట్లో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో బెడ్ల వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తోంది. తద్వారా ఖాళీల వివరాలు ఇట్టే తెలియడం ద్వారా ఆక్సిజన్, వెంటిలేటర్, సాధారణ బెడ్ల అవసరాన్ని బట్టి బాధితులు నేరుగా సదరు దవాఖానకు వెళ్లేందుకు అవకాశం దక్కనుంది.
కృత్రిమ కొరత నివారణకు ఉపాయం…
కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విషాదకర దుస్థితిలో దవాఖానల్లో బెడ్లు లేక బాధితులు కకావికలం అవుతున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ దవాఖానల్లో కనీసం బెడ్లు లభించకపోవడంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యవసర సమయంలో ఆక్సిజన్, వెంటిలేటర్ కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి ఏ దవాఖానలో బెడ్లు అందుబాటులో ఉన్నాయో తెలియడం లేదు. అదీగాక కృత్రిమ కొరత సృష్టించి ప్రైవేటు దవాఖాన యాజమాన్యాలు బెడ్లను వేలం పాట మాదిరిగా వేలాది రూపాయలకు అమ్ముకుంటున్నాయి. వేచి చూసే ధోరణిని ప్రదర్శిస్తూ మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ముందస్తు చెల్లింపులు చేయించుకోవడంతోపాటు గంటల తరబడి వెయిటింగ్ ద్వారా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఇదంతా బెడ్ల ఖాళీ వివరాల్లో గోప్యతతోనే జరుగుతోందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం… సరికొత్త ఉపాయాన్ని కనుక్కుంది. ప్రైవేటు దవాఖాన ఆగడాలకు చెక్ పెడుతూ ఆన్లైన్లో బెడ్ల వివరాలు నమోదు చేసే విధంగా ఏర్పాట్లు చేసింది. నిజామాబాద్ జిల్లాలో 17 ప్రైవేటు దవాఖానల్లో కొవిడ్ చికిత్స అందుబాటులో ఉంది. మూడు ప్రభుత్వ దవాఖానల్లోనూ చికిత్స అందిస్తున్నారు. ఆయా దవాఖానల్లో బెడ్ల వివరాలు ఇలా ఉన్నాయి.