ఆలేరు నియోజకవర్గం వ్యాప్తంగా182 గొలుసుకట్టు చెరువులకుమరమ్మతులు
ఈజీఎస్ పథకం కింద రూ. 10.35 కోట్లు మంజూరు
ఇప్పటికే మిషన్ కాకతీయతో రూ. 152.86 కోట్లతో చెరువుల ఆధునీకరణ
రూ. 12.46 కోట్లతో10 నూతన చెక్ డ్యాంలు
23 చెక్డ్యాంలకు మరమ్మతులు
నాలుగు మినీట్యాంకు బండ్లు
16 ప్యాకేజీలతో అదనపు ఆయకట్టుకు గోదావరి జలాలు
త్వరలో మరిన్ని చెక్డ్యాంలు
యాదాద్రి, జూన్ 6 : చెరువులను ఆధునీకరించి, ప్రతినీటి బొట్టును ఒడిసి పట్టాలన్న సంకల్పానికి నాంది పడింది. కరోనా కట్టడి నేపథ్యంలో లాక్డౌన్ విధించిన ప్రభుత్వం.. ఉపాధిహామీ పనులకు మాత్రం మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆలేరు నియోజకవర్గం వ్యాప్తంగా 182 గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించాలన్న సంకల్పంతో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి ముందుకువెళ్తున్నారు. ఇందుకోసం ఉపాధిహామీ పథకం ద్వారా రూ. 10.35 కోట్లు మంజూరు కాగా పనులు ప్రారంభించారు. ఇప్పటికే నియోజకవర్గం వ్యాప్తంగా సాగునీటిని అందించాలని, అడుగంటిన భూగర్భజలాలు పెరుగుదలపై ప్రభుత్వం దృష్టి సారించి మిషన్ కాకతీయ పథకం ద్వారా రూ. 152.86 కోట్లతో 540 చెరువులను పునరుద్ధరించారు. రూ. 12.46 కోట్లతో 10 నూతన చెక్డ్యాం నిర్మాణంతో పాటు రూ.4.47 కోట్లతో 23 చెక్ డ్యాంల పునరుద్ధరణ చేపట్టి వృథా జలాలను ఒడిసిపట్టారు. రూ. 12.37 కోట్లతో నియోజకవర్గం వ్యాప్తంగా నాలుగు మినీ ట్యాంక్ బండ్లను నిర్మించి నీటికి ఢోకాలేదనిపించారు. వర్షాకాలంలో చుక్క నీరు వృథా కాకుండా ఉండాలని మరిన్ని చెరువులను పునరుద్ధరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. నియోజకవర్గం వ్యాప్తంగా సాగుజలాలను సమృద్ధిగా వినియోగించేందుకు కావాల్సిన వసతుల ఏర్పాటు కోసం నిధుల మంజూరుకు ప్రభుత్వ విప్, త్వరలో సీఎం కేసీఆర్కు నివేదించనున్నారు.
చెరువులకు మహర్దశ
వర్షాకాలంలో ప్రతి నీటి చుక్కను సద్వినియోగించుకునే విధంగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈజీఎస్ పథకాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి గొలుసుకట్టు చెరువులను ఆధునీకరించనున్నారు. ఇందుకోసం కలెక్టర్ అనితారామచంద్రన్, డీఆర్డీఏ పీడీ ఉపేందర్రెడ్డి, ఇతర ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఉపాధిహామీ పథకం ద్వారా రూ. 10,35,16,071 నిధుల మంజూరుకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కృషి చేశారు. ఫీడర్చానల్ కాల్వ పటిష్టత, పిచ్చి మొక్కల తొలగింపు, కాల్వపూడికతీత పనులు చేపట్టనున్నారు. గతేడాది కురిసిన వర్షాలతో కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు కాల్వ లు తెగిపోయి నిర్వీర్యంగా మారాయి. పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వ విప్.. వెంటనే కాల్వలను పునరుద్ధరించి చెరువుల్లో నీటి నిల్వలు పెంచాలని యోచించారు. వెంటనే ఈజీఎస్ పథకం ద్వారా ఆలేరు నియోజకవర్గం వ్యాప్తంగా 182 గొలుసుకట్టు చెరువులకు గానూ రూ. 10,35,16,071 నిధుల మంజూరుకు కృషి చేశారు. ఇప్పటికే ఆత్మకూరు(ఎం) మండలంతో పాటు మిగతా ఏడు మండలాల్లో పనులు ప్రారంభించారు.
చెరువుల ఆధునీకరణ
రైతులకు సాగునీటి సమస్యరావొద్దని, గత పాలకుల నిర్లక్ష్యంతో నిరాదరణకు గురైన చెరువులను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ చేపట్టింది. ఇందుకోసం మిషన్ కాకతీయ పథకం ద్వారా రూ. కోట్లతో చెరువుల పూడికతీత, కట్టపటిష్టత, కట్టుకాల్వ ఆధునీకరణ వంటి పనులు చేపట్టారు. ఆలేరు నియోజకవర్గం వ్యాప్తంగా మిషన్ కాకతీయ పథకం ద్వారా రూ. 152.86 కోట్లతో 540 చెరువులను ఆధునీకరించారు. మిషన్ భగీరథ మొదటి విడుతలో రూ. 39.33 కోట్లలో 115 చెరువులు, రెండో విడుతలో రూ. 45.62 కోట్లతో 144 చెరువులు, మూడో విడుతలో రూ. 45.46 కోట్లతో 169 చెరువులు, నాలుగో విడుతలో రూ. 22.45 కోట్లలో 112 చెరువులను ఆధునీకరించారు. వీటి ద్వారా 20,753 ఎకరాల ఆయకట్టుకు సాగుజలాలు అందించారు.
10 నూతన చెక్ డ్యాంలు
ఆలేరు నియోజకవర్గంలో వర్షపునీటి లభ్యత కలిగిన నాలుగు ప్రధాన వాగులపై నూతన చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టారు. దీంతో వాగుల్లో వచ్చిన నీటిని ఎక్కడికక్కడ నిల్వ చేసి అక్కడి ప్రాంతంలో భూగర్భజలాలు పెంచడంలో సఫలమయ్యారు. ఆలేరు పెదవాగులోని సాయిగూడెం వద్ద రూ. 2.20 కోట్లు, యాదగిరిగుట్ట మండలంలోని ధర్మారెడ్డిగూడెం వద్ద రూ. 1.96 కోట్లు, రాజాపేట మండలంలోని చల్లూరులో రూ. 1.47 కోట్లు, కాల్వపల్లిలో రూ. 1.24 కోట్లు, ఆత్మకూరు(ఎం) మండలంలోని ఖప్రాయిపల్లిలో బిక్కేరువాగుపై రూ. 1.64 కోట్లు, టీ. రేపాకలో రూ. 76.80 లక్షలు, కొండాపూర్లో రూ. 87.80 లక్షలు, మోటకొండూర్ మండలంలోని చాడలో రూ. 77 లక్షలు, తుర్కపల్లి మండలంలోని వెల్పుపల్లిలో రూ.76.20 లక్షలతో 10 చెక్డ్యాంలను నిర్మించారు. దీంతో 4,500 ఎకరాల ఆయకట్టుకు సాగుజలాలు అందాయి.
నాలుగు మినీ ట్యాంకు బండ్లు
రైతులకు సాగుజలాలు అందించాలన్న సంకల్పంతో ఆయా మండలాల్లో చెరువులను మరింత పటిష్టపర్చారు. నీటిని మరింతగా నిల్వచేయాలన్న సంకల్పంతో నియోజకవర్గం వ్యాప్తంగా ఆయా మండలాల్లోని చెరువులను మినీ ట్యాంకు బండ్లుగా మార్చారు. రూ. 5.60 కోట్లతో ఆలేరు మండలంలోని కొలనుపాకలో పిన్ చెరువు, రూ. 2.90 కోట్లతో యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం చెరువు, రూ. 2.58 కోట్లతో సైదాపురం పెద్ద చెరువు, రూ. 1.29 కోట్లతో గండి చెరువులను మినీ ట్యాంకు బండ్లుగా మార్చారు.
23 చెక్ డ్యాంలకు మరమ్మతులు
బిక్కేరు వాగు, ఆలేరు పెద్దవాగు, వివిధ కాల్వలపై గతంలో నిర్మించిన మొత్తం 23 చెక్డ్యాంలను రూ. 4.47 కోట్లతో మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టారు. బొమ్మలరామారం మండలంలోని బండకాడిపల్లిలో రూ. 17.70 లక్షలు, చీకటిమామిడిలో రూ. 15.80 లక్షలు, సోలిపేటలో రూ. 12.50 లక్షలు, ప్యారారంలో రూ. 25.90 లక్షలు, ఆత్మకూరు(ఎం)లోని ఖప్రాయిపల్లి బిక్కేరువాగుపై రూ. 5.05 లక్షలు, రాజాపేట మండలంలోని కాల్వపల్లిలో రూ.46.15 లక్షలు, నెమిలే వద్ద రూ. 47.75 లక్షలు, తుర్కపల్లి మండలంలోని కొండాపూర్లో రూ. 12.40 లక్షలు, తుర్కపల్లిలో రూ. 20.95లక్షలు, వెంకటాపురంలో రూ. 27.95 లక్షలు, యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురంలో రూ. 5.74 లక్షలు, తాళ్లగూడెంలో రూ. 9.85 లక్షలు, తాళ్లగూడెం-మాసాయిపేట క్రాసింగ్ వద్ద రూ. 23.74 లక్షలతో చెక్ డ్యాంలకు మరమ్మతులు చేపట్టారు. ఈ చెక్ డ్యాంలు అందుబాటులోకి వచ్చి వృథాగా పోతున్న నీటిని ఒడిసిపడుతున్నాయి.
16 ప్యాకేజీలతో అదనపు ఆయకట్టు..
కాళేశ్వరం ప్రాజెక్టులోని 16వ ప్యాకేజీలో భాగంగా నిర్మితమవుతున్న నృసింహస్వామి జలాశయం మేజర్ కెనాల్ ద్వారా ఆలేరు నియోజకవర్గానికి అదనపు ఆయకట్టుకు సాగు జలాలు రానున్నాయి. జలాశయంలోని ప్రధాన కాల్వకు మేజర్ డిస్ట్రిబ్యూటరీ కాల్వ (ఆఫ్టెక్) ఏర్పాటు చేసి, ఆఫ్టెక్-1,2,3,5ల ద్వారా ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాల్లోని 699 చెరువులు నింపి, 53,500 ఎకరాల అదనపు ఆయకట్టుకు గోదావరి జలాలు అందించే వీలుంది.
మరో 25 చెక్ డ్యాంలకు ప్రతిపాదనలు
ఆలేరు ప్రాంతం పూర్తిగా వర్షాధారిత ప్రాంతంగా ఉంటూ వస్తున్నది. వర్షాలు, వరదనీళ్లు పూర్తిగా వాగుల ద్వారా బయటకు వెళ్లి, నీళ్లు వృథాగా పోతున్నాయి. దీంతో ఇక్కడి ప్రాంత రైతులకు వాగులు నిరూపయోగంగా ఉంటూ వస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో వాగులపై చెక్డ్యాంలు నిర్మించడం వల్ల భూ గర్భజలాలు పెరిగి రైతులకు వర్షపు నీళ్లు ఉపయోగానికి వస్తాయి. ఆలేరు నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటికే 33 చెక్డ్యాంల నిర్మాణం చేపట్టాం. వాగుల్లో నీటిని ఎక్కడికక్కడ ఒడిసిపడు తున్నాం. నీళ్లు వృథా కాకుండా చెరువుల్లోకి మళ్లించి గొలుసుకట్టు ద్వారా నీటిని నిల్వ చేసుకుంటున్నాం. మరిన్ని చెక్ డ్యాంలు నిర్మించాల్సిన అవస రం ఉంది. ఇదే విషయంపై గత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకు పోగా సానుకూ లంగా స్పందించారు. ఆలేరు నియోజకవర్గం వ్యాప్తంగా నాలుగు ప్రధానవాగులు ప్రవహిస్తాయి. వీటిలో మరో 25 చెక్ డ్యాంలు నిర్మించాలని ప్రతిపాదించాం. ఇందుకోసం రూ. 100 కోట్ల అంచనాతో నివేదిక తయారు చేశాం. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు నివేదిస్తాం. రాబోయే 25 చెక్డ్యాంలతో మరో 2,860 ఎకరాల ఆయకట్టుకు సాగుజలాలు అందనున్నాయి.
గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే