ఆహా.. తెలుగు ప్రేక్షకులకు లాక్ డౌన్ సమయంలో బాగా అంటే బాగా చేరువైన ఓటిటి సంస్థ. అచ్చ తెలుగు సినిమాలను అందరికీ అందిస్తూ దూసుకుపోతుంది అల్లు అరవింద్ సంస్థ. మొదలు పెట్టినపుడు ఆహా పెద్దగా సక్సెస్ కాలేదు. చాలా వరకు వెబ్ సిరీస్ లు కూడా చేసారు కానీ జనాల్లోకి వెళ్లలేదు. అదే సమయంలో మొదలైన లాక్ డౌన్ ఈ సంస్థకు వరంగా మారింది. అప్పట్నుంచి ఆహా.. నిజంగానే ఆహా అనిపిస్తుంది. వరసగా వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలు కూడా కొంటూ టాప్ ఓటిటిగా మారిపోయింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆహాలో ఏం చేసినా లక్షల్లోనే ఖర్చు ఉంది. కోట్ల వరకు అది వెళ్లలేదు. కానీ ఇప్పుడు ప్లాన్స్ మార్చేస్తున్నారు ఆహా నిర్వాహకులు.
మిగిలిన ఓటిటి సంస్థలు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ రేంజ్ లో తాము కూడా వెబ్ సిరీస్, ఒరిజినల్ సినిమాలు చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే వాటికి ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించినట్లు తెలుస్తుంది. ఇందులో కొన్ని వెబ్ సినిమాల రేట్ కూడా లక్షల్లోనే ఉంది. మహా అయితే 50 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు. అయితే ఇప్పుడు లీడింగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి భారీ ఖర్చుతో మూడు వెబ్ సిరీస్ లు చేయబోతున్నాడు ఆహా కోసం. ఆయనతో పాటు మారుతి, నందిని రెడ్డి, క్రిష్ కూడా ఈ సంస్థ కోసం భారీగా ఖర్చు చేసి వెబ్ సిరీస్ లు సిద్ధం చేయబోతున్నారు.
నందిని రెడ్డి, క్రిష్ ఇదివరకే ఆహా కోసం పని చేసారు. ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నారు. బయట ఉన్న పరిస్థితులను క్యాష్ చేసుకోవాలంటే కచ్చితంగా ఇలాంటివి తప్పవని ప్లాన్ చేస్తున్నారు అల్లు అరవింద్. దాదాపు 25 కోట్లతో ఆహా ఒరిజినల్స్ పేరుతో వరసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పట్నుంచి కొత్త ఆహాను చూస్తారంటున్నాడు ఈయన. మరి చూడాలిక.. ఆహా ఒరిజినల్స్ కూడా ప్రేక్షకులతో ఆహా అనిపిస్తుందో లేదో..?