న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్కు చెందిన అప్నాదళ్ పార్టీ అధ్యక్షురాలు, మీర్జాపూర్ ఎంపీ అనుప్రియా సింగ్ పటేల్ మళ్లీ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. కుర్మి వర్గానికి చెందిన ఆమె, ప్రధాని మోదీ తొలి ఐదేండ్ల పాలనలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. బీజేపీ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. కాగా, వెనుక బడిన వర్గాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఇటీవల అనుప్రియా పటేల్ డిమాండ్ చేశారు. సర్దార్ పటేల్ జాతీయ స్మారకాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు.
మరోవైపు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర వెనుక బడిన వర్గాలను ఆకట్టుకునేందుకు యూపీలో ఎన్డీఏ మిత్రపక్షమైన అప్నాదళ్ పార్టీ అధ్యక్షురాలు అనుప్రియా సింగ్ను తిరిగి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల అనుప్రియా సింగ్ను కలిసి కేంద్ర మంత్రివర్గంలోకి చేరడంపై ఆమెతో చర్చించారు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన మెగా కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కేంద్ర సహాయ మంత్రిగా అనుప్రియా సింగ్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు.