హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గొర్రెల యూనిట్ల పంపిణీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమాధానం ఇచ్చారు. రాష్ర్టంలో గొర్రెల పంపిణీ తర్వాత దాని నుంచి వచ్చిన సంపద రూ. 5,490 కోట్లు అని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ర్టంలో లభ్యంగా ఉంచిన గొర్రెల యూనిట్ల సంఖ్య 3,66,976 అని తెలిపారు. గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు 4 వేల 587 కోట్ల 20 లక్షలను ఖర్చు చేసిందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ర్టంలోని కులవృత్తులకు ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు. ఆర్థిక వనరులను ఉపయోగించుకుని కులవృత్తులను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.
సీఎం సంకల్ప బలం చాలా గొప్పదన్నారు. గొల్లకురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గొర్రెల పంపిణీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వాలు చేయలేని పనులను ఈ ప్రభుత్వం చేస్తుందన్నారు. కరోనా కారణంగా గొర్రెల రేట్లు బాగా పెరిగిపోయాయి. ఈ బడ్జెట్లో గొర్రెల పంపిణీకి 3 వేల కోట్లు కేటాయింపు చేశారన్నారు. మరో 3 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేయబోతున్నామని తెలిపారు.
అడవుల్లో గొర్రెలను మేపుకోవడానికి సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారు. గొర్రెల మేతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం అని మంత్రి తలసాని చెప్పారు. పెండింగ్లో ఉన్న డీడీలకు త్వరలోనే క్లియర్ చేస్తామన్నారు. రెండో ఫేజ్కు విధివిధానాలు ఖరారు చేస్తామని పేర్కొన్నారు. రాష్ర్టంలో గొర్రెల సంఖ్య 3 కోట్లకు చేరింది. గతంలో గొర్రెల సంఖ్య కోటి 20 లక్షలు మాత్రమే ఉండేదన్నారు. ఈ లెక్కలను కేంద్రం పార్లమెంట్లో వెల్లడించిందని తెలిపారు. గొర్రెల నుంచి రూ. 5,490 కోట్ల సంపద వచ్చిందన్నారు. మాంసం ఉత్పత్తి విషయంలో తెలంగాణ రాష్ర్టం ముందు వరుసలో ఉందని మంత్రి తలసాని స్పష్టం చేశారు.