బెంగళూర్ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన మైసూర్లో వైద్యవిద్యార్ధినిపై సామూహిక లైంగిక దాడి ఘటనకు సంబంధించి కర్నాటకకు చెందిన మరో మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై కార్మిక శాఖ మంత్రి శివరాం హెబ్బర్ మాట్లాడుతూ లైంగిక దాడి ఘటనలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయని..వీటికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనే డిమాండ్లు రాజకీయ క్రీడ అని వ్యాఖ్యానించారు.
హోంమంత్రిని సమర్ధిస్తూ హెబ్బర్ చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు. కాగా మైసూర్లో విద్యార్ధిని లైంగిక దాడి ఘటనపై హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాత్రి ఏడు గంటల సమయంలో యువతి అక్కడ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. యువకుడితో కలిసి ఆమె ఆ ప్రాంతానికి కాకుండా మరో చోటికి వెళ్లాల్సిందని పేర్కొన్నారు. హోంమంత్రి ఆపై తన వ్యాఖ్యలకు క్షమాపణ కోరారు. మహిళలకు పూర్తి రక్షణ కల్పించేలా అన్ని చర్యలూ చేపడతామని పేర్కొన్నారు.