మణికొండ, జూలై 12 : ప్రజా అవసరాలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిధులను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాశ్గౌడ్ అన్నారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఆనందా బే హిల్స్ గేటెడ్ కమ్యూనిటీ అపార్టుమెంటు నూతన కమిటీ అధ్యక్షుడు నీలేశ్ప్రసాద్ దూబే నేతృత్వంలో ప్రతినిధులు సోమవారం ఎమ్మెల్యేను కలిసి మౌలిక సదుపాయాలపై చర్చించారు. తాగునీటి సమస్య, విద్యుత్ సరఫరా, అంతర్గత మురుగునీటి కాల్వల అభివృద్ధ్ది, కమ్యూనిటీలలో చేపట్టాల్సిన పనులపై అధ్యక్షుడు నీలేశ్ప్రసాద్ దూబే ఎమ్మెల్యేకు వివరించారు. ఆనందా పోయిట్రీ, ఆనందా బే హిల్స్ గేటెడ్ కమ్యూనిటీలల్లో మొత్తంగా వెయ్యి కుటుంబాలు నివాసముంటున్నాయని, వీరందరికీ మౌలిక సదుపాయాల కల్పనలో సహకారం కావాలని వారు కోరారు. కార్యక్రమంలో కమిటీ ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్, ఉపాధ్యక్షుడు వినయ్, సలహాదారులు వేణుగోపాల్, రాజా తదితరులు పాల్గొన్నారు.