వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్
మామిళ్లగూడెం, మార్చి 30: గ్రామ పంచాయతీల్లో వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడిన సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి జిల్లా అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 2019లో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ పంచాయతీల్లో ఏర్పడిన ఖాళీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3న ఓటర్ల జాబితా ముసాయిదా నోటిఫికేషన్ ప్రకటించాలన్నారు. ఏప్రిల్ 10లోగా మార్పులు చేర్పుల ప్రక్రియ పూర్తి చేసి 12న ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించారు. ఖమ్మం కలెక్టర్ కర్ణన్ .. జిల్లాలోని ఖాళీ పదవుల వివరాలను తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు వివిధ కారణాలతో 45 వార్డు సభ్యుల పదవులు, ఒక సర్పంచ్ పదవి ఖాళీ అయ్యాయని వివరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, డీపీవో ప్రభాకర్రావు పాల్గొన్నారు.